
ప్రభుత్వాలు కృషి చేయాలి..
పెడన: వస్త్ర ప్రపంచంలో ఎన్ని ఆధునిక డిజైన్లు అవతరిస్తున్నా వన్నెతగ్గనిదిగా సహజసిద్ధ కలంకారీ నిలుస్తోంది. ఈ ప్రాచీన కళకు సరికొత్త హంగులు అద్దుతున్న తరుణంలో మరింత ప్రాచుర్యం కోసం కలంకారి పరిశ్రమలు చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తోంది. ఆఫ్లైన్ బిజినెస్తో పాటు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉండటంతో.. ఫ్యాషన్ డిజైన్ యూనివర్సిటీలు, కళాశాలలు దీనిపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలోనే డెహ్రాడూన్లోని గ్రాఫిక్ ఏరా హినియన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్ చేస్తున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రాజెక్టు వర్క్కు కలంకారీని ఎంపిక చేసుకున్నారు. వర్సిటీలో మొత్తం 45 మంది వివిధ ప్రాంతాల్లో, ముగ్గురు ముగ్గురు చొప్పున 15 బ్యాచ్లుగా విడిపోయి ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఊటీ, వెస్ట్ బెంగాల్, బెనారస్ తదితర ప్రాంతాల్లో ప్రాజెక్టు చేస్తున్నారు. వారిలో ఒక బ్యాచ్ కృష్ణా జిల్లాలోని పెడనలో శ్రీనివాస కోరమండల్ కలంకారీ అండ్ హ్యాండ్ లూమ్స్ హౌస్ను ఎంపిక చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే వీరు ప్రాజెక్టు వర్క్ మొదలు పెట్టి 15 రోజులు అయింది.
ప్రాసెసింగ్ నుంచి ప్రింటింగ్ వరకు..
ప్రాజెక్టు వర్క్ చేసేందుకు వచ్చిన విద్యార్థినులు కోరా క్లాత్ను ఏ విధంగా సిద్ధం చేయాలి, సహజ సిద్ధ రంగులు ఏ విధంగా తయారు చేస్తున్నారు.. ఏయే రంగులు వేటి ద్వారా వస్తున్నాయి.. వంటి వివరాలను తెలుసుకోవడంతో పాటు లిఖితపూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. రికార్డులు రాసుకుంటూ స్వయంగా క్షేత్రస్థాయిలో ప్రాసెసింగ్లో భాగస్వాములవుతున్నారు.
కలంకారీపై తొలిసారిగా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న డెహ్రాడూన్ వర్సిటీ విద్యార్థినులు కళకు సరికొత్త హంగులద్దడమే లక్ష్యమంటున్న విద్యార్థినులు
సహజ సిద్ధ కలంకారీ కళను బతికించడానికి, మరింత ప్రాచుర్యం చెందేలా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు వర్క్లను చేసుకునేలా విద్యార్థులను ప్రొత్సహించేలా అడుగులు వేస్తే బాగుంటుంది. విద్యార్థినులు స్వతహాగా ప్రాజెక్టు వర్క్ చేయాలని రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి చేయగలిన సహాయం చేస్తాం.
– పిచ్చుక వరుణ్కుమార్,
శ్రీనివాస కోరమండల్ అధినేత, పెడన

ప్రభుత్వాలు కృషి చేయాలి..