
ప్రజలకు ముఖాలు చూపలేకపోతున్నాం
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేటలో శుక్రవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో అత్యవసర సేవలైన తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్య నిర్వహణపై కౌన్సిల్ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. పార్టీలకు అతీతంగా టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ సభ్యులు సమస్యలపై పాలకవర్గాన్ని ఏకపక్షంగా నిలదీశారు. ఒకానొక సందర్భంలో కూటమి పాలకవర్గానికి చెందిన టీడీపీ మహిళా కౌన్సిలర్ కంచేటి గీతారాణి తన వార్డులో పనులు చేయడం లేదని, వార్డులో తనను గెలిపించిన ప్రజలకు ముఖాన్ని చూపించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తనకు చివరి సమావేశం అని, వచ్చే సమావేశానికి తాను రానని, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ మీటింగ్ హాల్లో శుక్రవారం కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగింది. చైర్మన్ రాఘవేంద్ర మాట్లాడుతూ 15 వ ఆర్థిక సంఘానికి సంబంధించి వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.11.27 కోట్లు మంజూరయ్యాయని, వాటితో పట్టణంలోని పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
ప్రజల్లో అసంతృప్తి తొలగించలేకపోతున్నాం
జనసేనకు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ కూటమి పాలనలో కోట్ల నిధులు మంజూరవుతున్నప్పటికీ ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించలేకపోతున్నామన్నారు. పారిశుద్ధ్య పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కాలువల్లో వారాల తరబడి చెత్త తొలగించడంలేదని, వార్డుల్లో వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. జనసేన కౌన్సిలర్ కొలగాని రాము మాట్లాడుతూ తన వార్డులో పాఠశాల వద్ద 4 స్పీడుబ్రేకర్లు వేయాలని కొన్ని నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో జనసేన సభ్యుడు గింజుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ వీధిలైట్లు లేక ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామన్నారు.
కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా :
కంచేటి గీతారాణి
టీడీపీ మహిళా కౌన్సిలర్ కంచేటి గీతారాణి మాట్లాడుతూ తన వార్డులో ఎర్రకాలువ, వేపలవాగు అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ముఖం చూపింలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలర్గా కొనసాగలేనని, రాజీనామా చేస్తానని అన్నారు. టీడీపీ కౌన్సిలర్ వెంకట్ మాట్లాడుతూ శానిటేషన్ ఉద్యోగులు 144 మంది ఉన్నారని, వచ్చేది 80 మంది మాత్రమేనన్నారు. జనసేన కౌన్సిలర్ పందుల రోశయ్య మాట్లాడుతూ కోదాడ రోడ్లో ఎస్బీఐ వద్ద ఇప్పటికి 20 సార్లు పైపులైన్ మరమ్మతులు చేశారని, ఆ ఖర్చుతో కొత్త పైపులైన్ వేయించవచ్చునన్నారు.
వివక్ష చూపిస్తున్నారు:
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మనోహర్...
తన వార్డులో వేపలవాగు బ్రిడ్జి కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నా చేయడం లేదన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజున్నీసా(వైఎస్సార్ సీపీ) మాట్లాడుతూ తన వార్డులో 10 రోజుల నుంచి తాగునీరు రావడంలేదని, కనీసం వాల్వ్ తిప్పే ఆపరేటర్ కూడా లేడని వాపోయారు.
వార్డుల్లో తిరగలేకపోతున్నాం
చైర్మన్ను నిలదీసిన టీడీపీ,
జనసేన సభ్యులు
రాజీనామా చేస్తానన్న
టీడీపీ మహిళా కౌన్సిలర్
పాలకవర్గ సభ్యులే
ప్రతిపక్షంగా మారిన వైనం