సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ మోసాల అదుపు | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ మోసాల అదుపు

Jun 29 2025 2:24 AM | Updated on Jun 29 2025 2:24 AM

సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ మోసాల అదుపు

సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ మోసాల అదుపు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు బాగా పెరిగాయని, మనకు తెలియకుండానే బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు కూడా దోచే పరిస్థితులున్నాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నేరాలను అరికట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి వీధి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సురక్షా 360ను హోంమంత్రి అనిత శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి ఆలయం, చర్చి, మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా సురక్ష డివైన్‌ ఏర్పాటు, 28 స్టేషన్‌ అధికారులకు సురక్ష డివైన్‌ కిట్‌లు అందజేశారు. జిల్లాలోని ప్రజల భద్రత కోసం 321 గ్రామాలు, 20 మండలాలు, నాలుగు మునిసిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థలోని 64 వార్డులు మొత్తం 1211 చదరపు కిలోమీటర్లు అంతా నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దాతల సహకారంలో ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ గుణదలలోని వెన్యూ కల్యాణ మండపంలో జరిగిన సురక్ష 360 ప్రారంభోత్సవంలో పాల్గొన్న హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందన్నారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్‌ స్తంభించినా, అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అస్త్రం యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చేస్తున్నారని, ఈ యాప్‌ని విశాఖ పోలీసులు స్ఫూర్తిగా తీసుకుని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

నేరాలు తగ్గించేందుకు పోలీసులు సమష్టిగా కృషి చేయాలి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలి సురక్ష 360 ప్రారంభోత్సవంలో హోంమంత్రి వంగలపూడి అనిత

ప్రతి గ్రామంలో 4 సీసీ కెమెరాలు

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజ శేఖరబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఎమ్మెల్యే సుజనా చౌదరి సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్‌, బొండా ఉమా, సుజనాచౌదరి, కొలికపూడి శ్రీనివాసరావు, శ్రీరాం రాజగోపాల్‌, కలెక్టర్‌ జి.లక్ష్మీశ, డీసీపీ సరిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement