
ధాన్యం.. దైన్యం
వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన రైతు వి.సూర్యప్రకాష్ నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వెల్లంకి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మే నెలాఖరులో ధాన్యం విక్రయించాడు. మొత్తం 465 టిక్కీలు ధాన్యం కాటా వేసి పది రోజులకు పైగా పొలంలోనే ఉంచారు. లారీలు లేవని చెప్పి ధాన్యం తీసుకెళ్లలేదు. వర్షాలు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోలేదు. పన్నెండు రోజుల తర్వాత పొలంలోని ధాన్యం తరలించారు. 24 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు జమ కాలేదు. ఖరీఫ్కు సమాయత్తం కావడానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్నాడు.
పెట్టుబడికి డబ్బులు లేవు
కొనుగోలు కేంద్రంలో మే నెలలో 185 టిక్కీల ధాన్యం విక్రయించాను. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్నారు. రెండు నెలలైనా డబ్బులు రాలేదు. సుమారు రూ.2లక్షలు రావాల్సి ఉంది. మళ్లీ సీజన్ ప్రారంభమైంది. పెట్టుబడికి డబ్బులు లేవు. ఽతక్షణమే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.
– కె.మల్లికార్జున రావు, ఇబ్రహీంపట్నం
రైతుల పక్షాన ఆందోళన చేస్తాం
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రైతులకు రెండు నెలలుగా డబ్బులు చెల్లించలేదు. మొత్తం కౌలు రైతులే ఉన్నారు. కౌలు చెల్లింపు, పెట్టుబడులకు డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఎండీని కలిస్తే త్వరలో చెల్లిస్తామన్నారు. ఇప్పటికే 15 రోజులు గడిచింది. రైతుల పక్షాన ఈనెల 30న ఆందోళన చేపడతాం. రైతుల బకాయిలు చెల్లించాలి.
– జమలయ్య, కౌలు రైతు సంఘం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఏ వర్గాన్నీ వదలకుండా అందరికీ బకాయిలు పెడుతోంది. విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగులకు డీఏ బకాయిలు పెట్టినట్లే ....రైతులకు ధాన్యం సొమ్ము బకాయి పడింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోగా, వారి నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ధాన్యం విక్రయించిన రైతులు డబ్బుల కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కౌలు చెల్లించేందుకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి వస్తే అన్నదాత సుభీభవ పథకం కింద ఇస్తామన్న రూ.20వేలు ఆర్థిక సహాయం అందించలేదు. కొన్ని కేంద్రాల వద్ద సిబ్బంది రేపు మాపు అంటూ రైతులను తిప్పుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
రెండు నెలలు గడిచినా...
ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం 824 మంది రైతులకు రూ.30.27 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరంతా ధాన్యం విక్రయించి రెండు నెలలు కావస్తోంది. వీరిలో 60 శాతానికి పైగా కౌలు రైతులు ఉన్నారు. ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులతో కౌలు, ఎరువులు, పురుగుమందుల షాపుల్లో అప్పులు తీర్చాల్సి ఉంది. అప్పుల వాళ్లు, భూమి యజమానులు రైతుల ఇళ్ల చుట్టూ తిరుగుతు న్నారు. కానీ ధాన్యం విక్రయించినా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో ఎవరిని అడగాలో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు అధికారులు మాత్రం ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి ఏ ఒక్క రైతుకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. ఇటీవల రైతు సంఘాల నాయకులు కార్పొరేషన్ ఎండీని కలిసి రైతులకు బకాయిలు చెల్లించాలని వినతిపత్రం అందించారు. త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అతీ గతీ లేదు.
అప్పుల కోసం అన్నదాతల తిప్పలు
జిల్లాలో 824 మంది రైతులకు రూ.30.27 కోట్లు బకాయి రెండు నెలలుగా అవస్థలు పెట్టుబడుల కోసం ఎదురు చూపులు ఖరీఫ్ సాగు పనులు మరింత భారం

ధాన్యం.. దైన్యం

ధాన్యం.. దైన్యం

ధాన్యం.. దైన్యం