
దోషరహిత ఓటర్ల జాబితాకు సహకరించాలి
డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):దోషరహిత, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పక్షాలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని, అర్హులైన యువ ఓటర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్లోని ఏవీఎస్ఎన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పక్షాలు ప్రస్తుత ఓటర్ల జాబితాలో మరణించినా, శాశ్వతంగా వలస వెళ్లినా వారి పేర్లను బీఎల్వోకు తెలియజేయాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, ఓటరు కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించి ఫారం–8 నమోదు చేసి, సరిచేసేందుకు సహకరించాల్సిందిగా కోరారు. జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8 అర్జీలకు సంబంధించిన ప్రస్తుత వివరాలను తెలియజేసి సమాచారాన్ని రాజకీయ పక్షాలకు అందించారు. సమావేశంలో రాజకీయ పక్షాల ప్రతినిధుల సందేహాలను డీఆర్వో నివృత్తి చేశారు.సమావేశంలో ఎన్నికల సెల్ డెప్యూటీ తహసీల్దార్ ఏఎస్ఆర్ గోపాలరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నూతన యాగశాలను
అందుబాటులోకి తీసుకురండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై రాధాకృష్ణుల విగ్రహం వద్ద నూతనంగా నిర్మించిన యాగశాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను శనివారం ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పరిశీలించారు. దాత సంగా నరసింహారావు నిర్మించిన నూతన యాగశాలను త్వరగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన యాగశాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవో వెంట వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్, ఈఈ కోటేశ్వరరావు డీఈ అశోక్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సచివాలయాల ఇంజినీరింగ్ సహాయకుల బదిలీలు
విజయవాడరూరల్: ఉమ్మడి కృష్ణాజిల్లాలో గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులుగా పని చేస్తున్న వారికి బదిలీల ప్రకియ శనివారం ప్రారంభమైంది. విజయవాడ లోని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీరు కార్యాలయంలో బదిలీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని సుమారు 700 మంది ఇంజినీరింగ్ సహాయకులకు కాల్ లెటర్స్ పంపి అయిదు సంవత్సరాల పాటు ఒకే చోట పనిచేస్తున్న వారిని తప్పకుండా బదిలీ చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలు చేస్తున్నారు. పంచాయతీరాజ్ ఎస్ఈ రమణ, ఈఈ రమేష్, కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు బదిలీల ప్రక్రియలో పాల్గొన్నారు. బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరాలని చెబుతున్నారు.
నేడు దుర్గమ్మకు
తెలంగాణ బంగారు బోనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించనున్నారు. హైదరాబాద్లోని శ్రీ భాగ్యనగర్ మహంకాళీ జాతర అమ్మవారి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. సుమారు రెండు వందల మంది బేతాళ నృత్యాలు, తీన్మార్ డప్పులతో తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఊరేగింపు జరుగుతుంది. అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.

దోషరహిత ఓటర్ల జాబితాకు సహకరించాలి

దోషరహిత ఓటర్ల జాబితాకు సహకరించాలి