
విద్యార్థుల భవితను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
కోనేరుసెంటర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులకే ఉంటుందని, అటువంటి ఉపాధ్యాయులు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. కృష్ణాజిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణ తరగతులను నిర్వహించారు. ఈ తరగతులకు కలెక్టర్ హాజరై ఉపాధ్యాయులకు స్వయంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న వనరులు ఉంటే సరిపోదని సరైన ప్రజలు కూడా ఉండాలన్నారు. ఆ ప్రజలను మంచి వారిగా తీర్చిదిద్దాలంటే ఒక ఉపాధ్యాయునికే సాధ్యమవుతుందన్నారు. హను మంతుడికి తన శక్తి ఏమిటో తనకు తెలియదని, అలాగే విద్యార్థులలో ఉండే సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రేరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లదేనన్నారు. విద్యార్థుల జీవితాలను వారి తలరాతలను మార్చగలిగే శక్తి సామర్థ్యం ఒక్క ఉపాధ్యాయుడికే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జపాన్, ఉక్రెయిన్ దేశాలు ప్రపంచ పటంలో ఎలా ఎదిగాయనే విషయాన్ని సోదాహరణంగా వివరించారు. జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో జిల్లా 82.32 శాతం ఫలితాలను సాధించిందని, 161 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ గా నిలిచారని తెలిపారు. ఈసారి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం సాధించాలన్నారు. రిసోర్స్ పర్సన్లు గంపా నాగేశ్వరరావు, నండూరి సుబ్బారావు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఈ ప్రేరణ తరగతుల్లో విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ, రిజిస్ట్రార్ ఉష, ఉపవిద్యాధికారులు, జిల్లాలోని హెచ్ఎంలు పాల్గొన్నారు.
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉపాధ్యాయులకు స్వయంగా శిక్షణ ఇచ్చిన కృష్ణా కలెక్టర్ బాలాజీ