
గుర్తుతెలియని యువకుడి ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓ ఇంటి ముందు గేటుకు గుర్తు తెలియని యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళన చెందిన స్థానికులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం మేరకు.. నైజాంగేటు నుంచి ఫ్లోర్మెన్ బంగ్లాకు వెళ్లే మార్గంలో ఓ రేకుల ఇంటి ముందు ఇనుప గేటుకు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు కండువాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన మహిళలు గేటుకు వేళాడుతున్న మృతదేహాన్ని చూసి కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల వారితో పాటు యువకులు అక్కడికి చేరి మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే ఎవరికీ అతని ఆచూకీ తెలియలేదు. మృతుడి కుడి చేయి మణికట్టుపై పెద్ద పుట్టుమచ్చ ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వీఆర్వో నుంచి ఫిర్యాదు తీసుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.