
రైతులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
జూపూడిలో ఏరువాక పౌర్ణమిలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ
జూపూడి(ఇబ్రహీంపట్నం): వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలం పరిధిలోని జూపూడి గ్రామంలో జిల్లా స్థాయిలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్య క్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్ల భాగస్వామ్యం పెంచుకుని తక్కువ సమయంలో ఎరువులు, పురుగు మందుల పిచికారీ చేసుకోవాలని సూచించారు. పచ్చిరొట్ట, పశువుల ఎరువులతో భూమిని సారవంతం చేసుకుని ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా అవసరమైన మేరకే ఎరువులు వినియోగించుకోవా లని, వ్యవసాయంలో బిందు సేద్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటు పశుపోషణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ట్రాక్టర్తో దుక్కిదున్ని ఏరువాక పౌర్ణమి ప్రారంభించారు. డ్రోన్లతో మందుల పిచికారీ ప్రదర్శించారు. జక్కంపూడి, రాయనపాడు గ్రూపు సభ్యులకు రెండు డ్రోన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సుభాని, ఏడీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఏవో శైలజ, రైతులు పాల్గొన్నారు.