
వెబ్ కౌన్సెలింగ్కు బ్రేక్
ప్రారంభమైన ఎస్జీటీల మాన్యువల్ బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ విధానానికి బ్రేక్ వేసింది. టీచర్ల బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, 53 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 2,800 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) బదిలీ ప్రక్రియ మంగళవారం సాయంత్రం విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు.
సర్వర్ సమస్యలతో ఆలస్యం..
స్థానిక జిల్లా పరిషత్ (జెడ్పీ) సమావేశ మంది రంలో నిర్వహిస్తున్న మాన్యువల్ కౌన్సెలింగ్కు ఎస్జీటీలు మధ్యాహ్నం రెండు గంటలకే జెడ్పీకి చేరుకున్నప్పటికీ, అవసరమైన ఆన్లైన్ అనుమతులు ఆలస్యం కావడంతో అదే ప్రాంగణంలో గంటల తరబడి ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు చెట్ల కింద కూర్చొని అసహనానికి గురయ్యారు. కనీస వసతులు కల్పించలేదని పెదవి విరిచారు. కౌన్సెలింగ్ మొదటి రోజున 200 మంది ఎస్జీటీల బదిలీలను చేపట్టారు. టెక్నికల్ సమస్యలు ఎదురవడం, సర్వర్ మొరాయించటంతో ప్రక్రియలో జాప్యం జరిగింది. మొత్తం బదిలీల ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయుల అర్హతలు, ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
శాప్ పాలకవర్గ సభ్యులు వీరే..
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) పాలకవర్గ సభ్యుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఒలింపిక్ క్రీడాకారులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, క్రీడలకు ప్రోత్సాహం అందించే వ్యక్తులకు పాలకవర్గంలో చోటు కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి.వినయ్చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒలింపిక్ హాకీ క్రీడాకారిణి ఇ.రజిని(చిత్తూరు), అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు ఎ.రమణరావు(విజయ వాడ), ఎం.డి.రమేష్కుమార్(విజయనగరం), వ్యాయామ విద్యా అధ్యాపకుడు ప్రేమ్రవీంద్రనాథ్(పశ్చిమగోదావరి), క్రికెట్ క్రీడాకారుడు ఎస్.సంతోష్కుమార్(విజయవాడ), కె.జగదీశ్వరి(ఎన్జీవో), క్రీడలకు ప్రోత్సాహం అందించే బి.శివ(అనంతపురం), పి.బి.వి.ఎస్.ఎన్.రాజు(అనకాపల్లి) సభ్యుల జాబితాలో ఉన్నారు.