వాపును చూసి బలుపు అనుకుంటున్న బాబు

మీడియాతో మాట్లాడుతున్న కాకాని, రోజా - Sakshi

గన్నవరం: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఘనవిజయం సాధించడం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో గురువారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఏడు ఎమ్మెల్సీలకు పోటీ పడినప్పటికీ ఆరు స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ ఒకటి గెలుచుకుందన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలుపుతో చంద్రబాబు జన్మ ధన్యమైపోయినట్లుగా, టీడీపీ విపరీతంగా పుంజుకున్నట్లుగా కింది స్థాయి నుంచి సంబరాలు జరుపుకోవాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబుకు ఇదే చివరి విజయోత్సవ వేడుకలు అవుతాయని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ఓట్లతో నెట్టుకువచ్చిన చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటూ మోసపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ తరహాలో ప్రాధాన్యత ఓట్లు లేని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు సాగవని స్పష్టం చేశారు.

వెన్నుపోటుకు కేరాఫ్‌ బాబు

వైస్రాయ్‌ హోటల్‌లో ప్రారంభించిన వెన్నుపోటు రాజకీయాలను ఈ రోజుకీ ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చేస్తున్న చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టాలని మంత్రి ఆర్‌కే రోజా పిలుపునిచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేయడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రులను చేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేసిన చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో కనీసం రెండు సీట్లు కూడా రావని తెలిపారు. చంద్రబాబు ఎంత నీతిమాలిన రాజకీయాలు చేస్తే అంతా దిగజారిపోతాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. టీడీపీ డబ్బుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్‌ ఉండదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మాతో ఎమ్మెల్యేలుగా గెలిచి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం దుర్మార్గమన్నారు.

బాబువన్నీ నీతిమాలిన రాజకీయాలే జగన్‌మోహన్‌రెడ్డే మళ్లీ సీఎం కావడం ఖాయం మంత్రులు, కాకాని, రోజా

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top