
ఘన వ్యర్థ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర కమిటీ సభ్యుడు కుమార్, అధికారులు
గుడివాడరూరల్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర కమిటీ సభ్యుడు కడియాల కుమార్ అన్నారు. మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర బృంద సభ్యులు స్థానిక అధికారులతో కలసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కడియాల కుమార్, స్థానిక అధికారులు ఘన వ్యర్థ పదార్థాల కేంద్ర నిర్వహణ తీరును పరిశీలించారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు సేకరించి ఘన వ్యర్థ కేంద్రాలకు తరలించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. సర్పంచ్ వెలగలేటి రమ్య, పంచాయతీ కార్యదర్శి పాగోలు పూర్ణచంద్రరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ కేంద్ర బృంద సభ్యుడు కడియాల కుమార్