
నేడు వేల్పూర్లో దంగల్!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. గురువారం వేల్పూర్లో కాంగ్రెస్ పార్టీ ‘ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికి కనువిప్పు’ పేరిట గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమం వేడి పుట్టిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు సై అంటే సై అంటూ కత్తులు దూసుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా కాక రేగి.. పసుపు నేలలో సెగలు రగులుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విమర్శలు చేసిన నేపథ్యంలో రగడ మొదలైంది. దీంతో స్పందించిన డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి ప్రశాంత్రెడ్డి విమర్శలను సవాల్గా తీసుకున్నారు. ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఏమిటో చూపిస్తామని చెబుతున్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు చనిపోయిన 56 మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పరిహారం అందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను తోలుకొస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. వేల్పూర్ గాంధీ విగ్రహం వద్ద ‘ప్రశాంత్రెడ్డికి కనువిప్పు’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్రెడ్డి పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
పథకాలు రానివారిని తీసుకొస్తాం.. బీఆర్ఎస్
అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమం విషయంలో విఫలమైందని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమానికి ప్రతిగా కార్యక్రమం చేస్తామ ని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. సై అంటే సై అంటూ సవాల్ను స్వీకరిస్తున్నామని చెబుతున్నా రు. పరిహారం అందని గల్ఫ్ బాధిత కుటుంబాల ను, రుణమాఫీ, రైతుభరోసా రాని రైతులను తీసు కొస్తామన్నారు. బోనస్ రాని రైతులను పిలిస్తే భారీ గా వస్తారంటున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరులో నెగ్గే లక్ష్యంతోనే డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు గులాబీ కార్యకర్తలు అంటున్నారు. హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకే వేల్పూర్ కార్యక్రమం చేపట్టారంటున్నారు. అమలు కాని హామీల విషయంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశాంత్రెడ్డి నిలదీస్తే తట్టుకోలేకపోవడం ఏమిటన్నారు. తాము తీసుకొచ్చినవారికి పథకాలు ఇచ్చినట్లు నిరూపించలేకపోతే మానాల మోహన్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో వేల్పూర్లో గరంగరం వాతావరణం నెలకొంది.
ప్రశాంత్రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం..: మానాల
కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల్లో అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందిస్తోంది. గల్ఫ్ కార్మికులకు ఇప్పటికే పరిహారం చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశాంత్రెడ్డి మాటలు గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. ప్రశాంత్రెడ్డి పిలుపునకు స్పందించి వచ్చి న బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కళ్లు తెరిపిస్తాం. ఎమ్మెల్యే ప్రతి విమర్శను చూసి బీఆర్ఎస్ వాళ్లు గు డ్డిగా అనుసరించొద్దు.గాంధీ విగ్రహం వద్ద ప్రశాంత్రెడ్డి కోసం ఎదురుచూస్తాం. అవసరమైతే ప్రశాంత్రెడ్డి ఇంటివద్దకొస్తాం. కనువిప్పు కలిగిస్తాం.
పోలీసుశాఖ ఆంక్షలు
వేల్పూర్: శాంతిభద్రతలకు విఘాతం కలకుండా వేల్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆంక్షలు విధిస్తూ సీపీ సాయిచైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వేల్పూర్ ఎస్సై సంజీవ్ బుధవారం రాత్రి తెలిపారు. ఎక్కడ కూడా నలుగురు కన్నా ఎక్కువ సంఖ్యలో గుమిగూడొద్దని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అధిగమించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న ఆరు గ్యారంటీలు పొందని లబ్ధిదారులతో కలిసి నిర్వహించే పరిచయ కార్యక్రమానికి అనుమతించాలని వేల్పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు వేల్పూర్ ఎస్సై సంజీవ్కు వినతి పత్రం అందజేశారు.
మాటల కత్తులు దూసుకుంటున్న
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు
ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి విమర్శల
నేపథ్యంలో కనువిప్పు పేరిట
కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్
తాము సిద్ధమేనని.. పథకాలు అందని రైతులను తీసుకొస్తామంటున్న బీఆర్ఎస్
ప్రశాంత్రెడ్డితోపాటు బీఆర్ఎస్
కార్యకర్తలకు కనువిప్పు కలిగిస్తాం..:
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి

నేడు వేల్పూర్లో దంగల్!