
ఘరానా దొంగల ముఠా అరెస్ట్
● 39 దొంగతనాలకు పాల్పడిన
8 మంది నిందితులు
● 15 తులాల బంగారం,
4 వాహనాల స్వాధీనం
● సీసీ ఫుటేజీ ఆధారాలతో కేసు ఛేదన
● సీపీ పోతరాజు సాయిచైతన్య వెల్లడి
ఖలీల్వాడి: జిల్లాలో చోరీలకు పాల్పడిన ఘరానా దొంగల ముఠా సభ్యులను సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అమేర్పై అనుమానం రావడంతో ఏసీపీ రాజావెంకట్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అమేర్ చిన్నతనంలో పిక్ ప్యాకెట్లకు పాల్పడేవాడని, దొంగతనాలు చేసేటప్పుడు హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఆసిఫ్తో పరిచయం ఏర్పడింది. అబ్దుల్ ఆసిఫ్ తనకు పరిచయం ఉన్న వసీం, సోహైల్, జావీద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ను మహమ్మద్ అమేర్కు పరిచయం చేశాడు. వీరంతా గతంలో నేరాలకు పాల్పడినవారే. అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముఠా సభ్యుల నగరంలోని ఆటోనగర్, ధర్మపురిహిల్స్, పెయింటర్ కాలనీ, డ్రైవర్ కాలనీ, అక్బర్నగర్ కాలనీ, శాంతినగర్లలో సుమారు 24 ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను షేక్ వసీంకు ఇచ్చేవారు. వసీం వాటిని నిజామాబాద్ రూరల్ మండలంలోని మోహన్కు అమ్మేవాడు. మోహన్ వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. వచ్చిన నగదును అందరూ కలిసి పంచుకునేవారు. వీరు హైదరాబాద్ శివార్లోని షాపూర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో 15 ఆటోలను కూడా దొంగతనం చేశారు. ముఠాసభ్యుల్లో షేక్ వసీంపై 8 కేసులు ఉండగా మీర్పేట్లో పీడీయాక్ట్ నమోదు చేశారు. షేక్ సోహైల్ అలియాస్ చార్పాట్ సోహైల్పై గతంలో 7 కేసులు, మహమ్మద్ అమేర్పై 21 కేసులు, మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్పై 10 కేసులు, జావీద్ ఖాన్ 5 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ముఠా సభ్యులపై నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ నగరాలలో కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు. బంగారం కొనుగోలు చేసిన మోహన్పై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి 15 తులాల బంగారం, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో బబ్లూ, అలీ అనే నిందితులు పరారీలో ఉన్నారని, మిగతా వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ సురేశ్, ఎస్సై వెంకట్రావు, కానిస్టేబుళ్లను అభినందించి, రివార్డు అందజేశారు.

ఘరానా దొంగల ముఠా అరెస్ట్

ఘరానా దొంగల ముఠా అరెస్ట్