
సీనియారిటీ ప్రకారమే పదోన్నతులు కల్పించాలి
సుభాష్నగర్: ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వెంటనే ఇప్పించాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె దయాసాగర్, దొంతుల నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎన్డీసీసీబీ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో సీఈవో నాగభూషణం వందేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవో ఎంఎస్ 44 ప్రకారం డీఎల్ఈసీ ఫండ్ ద్వారా జీతాలు లేని అన్ని సంఘాలకు జీతాలు ఇచ్చి బదిలీలు చేపట్టాలన్నారు. సంఘ ఉద్యోగుల పదవీవిరమణ బెనిఫిట్స్ డీసీసీబీ ద్వారా ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు సొంత జిల్లాలో మాత్రమే బదిలీలు చేయాలని, 2019 తర్వాత నుంచి పనిచేస్తున్న వారికి కూడా జీవో ఎంఎస్ 44 అమలు చేయాలన్నారు. ఎన్డీసీసీబీ ఉద్యోగుల నియామకాల్లో సంఘ ఉద్యోగులతో 25 శాతం భర్తీ చేయాలన్నారు. సంఘ ఉద్యోగుల బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా చేపట్టాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ఐడీ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్యాక్స్ ఉద్యోగులు, సీఈవోలు బస్వంత్ రావు, విష్ణువర్ధన్, నాగరాజు, సుభాష్, మోహన్, ఉమ్మడి జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎన్డీసీసీబీ సీఈవోకు సిబ్బంది వినతి