బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగిలో కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల చేపట్టడం సందిగ్థత నెలకొంది. ఆయకట్టుకు నీటి విడుదలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాని షెడ్యుల్ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే ప్రస్తుతం ప్రాజెక్ట్లో 9 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్లో 87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తారు. డివంబర్ 15 నుంచి మార్చి 31 వరకు నీటి విడుదల చేస్తారు. దీంతో 100 నుంచి 110 రోజుల్లో చేతికందే వరి వంగడాలను రైతులు సాగుచేస్తున్నారు. కాని ప్రస్తుత ఏడాది జనవరి 1 నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ముందుగా అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఆలస్యంగా నీటి విడుదల చేస్తే వేసవిలో పంటలకు నీరు అందడం గగనమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1 నుంచి నీటి విడుదల చేస్తే చేపడితే ఏప్రిల్ 15 వరకు నీటి విడుదల చేపట్టాల్సి ఉంటుంది. వేసవిలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా వడగండ్ల వర్షాలు కురిసే ప్రమా దం కూడా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గతంలో మార్చి 31 వరకు నీటి విడుదల చేపట్టేలా ప్రాజెక్ట్ ఉన్నత అధికారులు నీటి విడుదల షెడ్యూ ల్ చేపట్టారు. కాని ప్రస్తుత ఏడాది నీటి విడుదలపై మల్లగుల్లాలు పడ్తున్నారు.
ప్రాజెక్ట్లో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ప్రస్తుతం 78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో 5 టీఎంసీల నీరు డెడ్ స్టోరీజీ, 5 టీఎంసీలు తాగు నీటి అవసరాలకు, మరో 5 టీఎంసీలు ఆవిరి రూపంలో పోతుంది. ఈ లెక్కన 78 టీఎంసీల నుంచి 15 టీఎంసీల నీరు పోగా మిగిలేది 63 టీఎంసీల నీరే.. గతేడాది యాసంగి సీజన్కు 60 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం కూడా లెక్కల ప్రకారం యాసంగి సీజన్కు సరిపడా నీరు ఉండగా మరో 3 టీఎంసీల నీరు అదనంగా ఉంటుంది. అయినా ప్రాజెక్ట్ అధికారులు గతేడాది కంటే ప్రస్తుతం నీరు నిల్వ తక్కువ ఉందని జనవరి 1 నుంచి నీటి విడుదల చేపట్టే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల ఉన్నత అధికారులు స్పందించి నీటి విడుదల షెడ్యుల్పై వెంటనే నిర్ణయం చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా ఖరారు కాని నీటి విడుదల షెడ్యూల్
ఎస్సారెస్పీలో 78 టీఎంసీల నీటినిల్వ
ఆలస్యంగా వదిలితే వేసవిలో
ఇబ్బందిగా మారుతుందంటున్న రైతులు