
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
నిర్మల్చైన్గేట్: మాదకద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్లో కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ అధికారులు, పుర ప్రజలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించడం, వారికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగం చట్టపరంగా నేరమన్నారు. మాదకద్రవ్యాల రహిత నిర్మల్ జిల్లా సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ద్వారా బాధితులకు వైద్యసహాయం అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం తెలంగాణ సాంస్కతిక సారధి కళాజాత బృందాలు మాదకద్రవ్యాలపై చైతన్యం కలిగించే ప్రదర్శనలు ఇచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, ఎకై ్సజ్ అధికారి ఎంఏ.రజాక్, డీఎంహెచ్వో రాజేందర్, డీపీవో శ్రీనివాస్, డీపీఆర్వో విష్ణువర్ధన్, డీఆర్డీవో నాగవర్ధన్, డీవైఎస్వో శ్రీకాంత్రెడ్డి, సీడీపీవోలు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మెప్మా పీడీ సుభాష్, ఐకేపీ మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
● కలెక్టర్ అభిలాష అభినవ్