కవ్వాల్‌కు కొత్త పులులు! | - | Sakshi
Sakshi News home page

కవ్వాల్‌కు కొత్త పులులు!

Jun 29 2025 2:28 AM | Updated on Jun 29 2025 2:28 AM

కవ్వాల్‌కు కొత్త పులులు!

కవ్వాల్‌కు కొత్త పులులు!

● మహారాష్ట్ర నుంచి తరలించే యత్నం ● అంగీకరించిన తడోబా అధికారులు ● ఎన్‌టీసీఏ ఓకే చెబితేనే టైగర్ల రాక

సంరక్షణ సవాలే..!

కవ్వాల్‌లో విశాల భూభాగం పులుల జీవనానికి అనుకూలంగా ఉంది. కొంతకాలంగా ఇక్కడ గడ్డి క్షేత్రాల పెంపు, శాకాహార జీవుల పెరుగుదలతో పాటు కోర్‌ గ్రామాలైన కడెం మండలం రాంపూర్‌, మైసంపేటను తరలించారు. అయితే వలస పులులు సంచరిస్తున్న సమయంలో ఇదివరకు అనేక చోట్ల వేట ముప్పు ఎదుర్కొన్నాయి. విద్యుత్‌ కంచెలు, వేట కారణంగా అభయారణ్యంలో మృత్యువాత పడ్డాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టినా ఇక్కడి పరిస్థితులకు సరిపోక అనేక పులులు తిరిగి వెళ్లిపోయాయి. తాజాగా అధికారులు ఇక్కడికి తరలించే పులుల సంరక్షణ స్థానిక అధికారులకు సవాల్‌గా మారనుంది. సిబ్బంది కొరతతో పాటు స్థానిక పరిస్థితులు, అడవిలో మానవ అలజడి కొత్త పులుల జీవనంపై ప్రభావం చూపనుంది. మరోవైపు పునరావాస గ్రామాల వాసులకు పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని పేర్కొంటూ పాత గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధపడి నిరసనలు చేపట్టారు. కవ్వాల్‌ కోర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే మానవ కార్యకలాపాలు, పంట చేన్లు ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ జంతువు రక్షణకు ఇక్కడి అధికారులు మరింత శ్రమించాల్సి ఉంది.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్‌కు కొత్త పు లులు రానున్నాయి. మహారాష్ట్ర పులులను ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వాల్‌ కోర్‌ ప్రాంతంలో నేటి కీ ఒక్క పులి కూడా శాశ్వతంగా నివాసం ఏర్పరుచుకోలేదు. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ నుంచి పదుల సంఖ్యలో పులులు వలస వస్తూ.. పోతున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించిన మేరకు సంచరిస్తూ వెళ్లిపోతున్నాయి. తోడు, ఆవాసం, మానవ సంచారం కారణంగా పులులు వచ్చి తిరిగి వెళ్లి పోతున్నాయి.

ఆడ, మగ కలిపి ఐదు దాకా..

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ డివిజన్‌లో కొన్ని పులులు శాశ్వత నివాసమేర్పర్చుకోగా, ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, ఇచ్చోడ, బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల డివిజన్‌ల వరకు వాటి సంచారం ఉంది. అయితే చాలా పులులు ఇక్కడ సంచరించి కొద్ది రోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్‌లను టైగర్‌ కన్జర్వేషన్‌గా గుర్తిస్తూ అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి పులుల రక్షణకు వీలు కలగనుంది. మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని తడోబా పులులనే ఇక్కడికి తరలించేందుకు ప్రతిపాదనలు పంపగా, అక్కడి అధికారులు అంగీకరించడంతో కవ్వాల్‌కు కొత్తపులులు వచ్చే అవకాశాలున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు వరకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్‌టీసీఏ (జాతీయ పులుల సంరక్షణ సంస్థ) ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనుంది.

చివరికి తరలింపునకే మొగ్గు

మహారాష్ట్ర పులులు భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాకు వస్తాయనే దూరదృష్టితో 13ఏళ్ల క్రితం కవ్వాల్‌ కేంద్రంగా 2వేల చ.కి.మీటర్లకు పైగా అటవీ భూభాగాన్ని పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కోర్‌ ఏరియాలోనే పులులు నివాసమేర్పరుచుకోలేదు. ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. మానవ కార్యక్రమాలను తగ్గించేందుకు కోర్‌ పరిధిలో ఉండి, పులుల రాకపోకల మార్గంలో ఉన్న గ్రామాలను గుర్తించి తరలించడం ప్రారంభించారు. అయినా, పలు కారణాలతో పులులు రాలేదు. చివరకు మహారాష్ట్రలోని తడోబాలో అధికసంఖ్యలో ఉంటూ ఇరుకు ఆవాసాలు, సంరక్షణ కష్టమవుతున్న నేపథ్యంలో కవ్వాల్‌కు పులులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పులుల సంచారంతో తమకు ఇబ్బంది కలుగుతుందని స్థానిక గిరిజన రైతులు, అటవీ ప్రాంత సమీప గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement