
వంతెనలకు మోక్షమెప్పుడో?
కడెం: జిల్లాలో మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. వరద ఉధృతికి జిల్లాలో వంతెనలు కొట్టుకుపోయాయి. ధ్వంసమయ్యాయి. కొన్ని శిథిలావస్థకు చేరాయి. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు.దీంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో ఆయితే వీరి కష్టాలు వర్ణణాతీతం. అత్యవసర సమయాల్లో వాగులు దాటుతు ప్రమాదాలు బారిన పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరమ్మతులకు ప్రస్తుతం అనుకూల సమయం. ఇప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధలు చొరవ చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
● పెంబి మండలం పస్పుల గ్రామం సమీపంలో కడెం నదిపై ఉన్న వంతెన మూడేళ్ల క్రితం భారీ వరదలకు కొట్టుకుపోయింది. ఈ వంతెన ద్వారా కర్ణం, అంకెన, రాయదారి, తులసీపేట్, దయ్యలమద్ది గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకుంటారు. వంతెన శిథిలమవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో ప్రమాదకరంగా వాగులు దాటాల్సి వస్తోంది. ‘‘మా కష్టాలు వర్ణనాతీతం,’’ అని రాయదారి గ్రామస్తుడు చవన్ నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కుంటాల, సోన్లోనూ అదే పరిస్థితి..
కుంటాల మండలంలో కల్లూర్–బూరుగుపల్లి మధ్య జోడు వాగుపై వంతెన ఏడాదిన్నర క్రితం కూలిపోయింది. రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ‘‘అధికారులు స్పందించడం లేదు,’’ అని బూరుగుపల్లి రైతు కె. వెంకటరావు వాపోయారు. సోన్ మండలంలో మాదాపూర్, పాక్పట్ల దారిలో రూ. 3.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పూర్తికాక, గ్రామస్తులు నిరాశలో ఉన్నారు. ఖానాపూర్లో రెంకొని వాగుపై రెండు వంతెనల నిర్మాణం కూడా ఆలస్యమవుతోంది.
టెండర్లు, నివేదికలే
పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య మాట్లాడుతూ, ‘‘వంతెనల మరమ్మత్తుకు నివేదికలు పంపాము. పస్పుల వంతెన టెండర్ అప్రూవల్ దశలో ఉంది. త్వరలో పనులు ప్రారంభిస్తాం,’’ అని చెప్పారు. అయితే, గ్రామస్తులు వర్షాకాలం లోగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

వంతెనలకు మోక్షమెప్పుడో?