వరల్డ్‌ కార్‌ ఫ్రీ డే.. హరియాణా సీఎం కొత్త పథకం

World car free day: Haryana CM rides bicycle - Sakshi

చండీగఢ్: వరల్డ్‌ కార్‌ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ సైకిల్‌పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్‌యాత్ర చేపట్టారు. తన అధికారిక నివాసం నుండి సెక్రటేరియట్ వరకు సైకిల్‌పై వచ్చి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ మంత్రి జేపీ దలాల్,  రవాణా శాఖ మంత్రి మూల్‌చంద్ శర్మ సైకిల్‌పై పౌర సచివాలయానికి చేరుకోవడం విశేషం.  (World Car Free Day: ఎంచక్కా  సైకిల్‌పై షికారు చేద్దాం!)

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ.2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు.  ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు  చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 

కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఖట్టర్ చండీగఢ్ నుండి కర్నాల్ వరకు రైలులో ప్రయాణించారు. అలాగే సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆకర్షించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top