డబ్ల్యూహెచ్‌ఓ రిపోర్ట్‌లో భారత్‌ అని లేదు: కేంద్రం

Word Indian Not In WHO Report On Covid Variant - Sakshi

‘భారత్‌ వేరియంట్‌’ కథనాలపై కేంద్రం ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో బయటపడిన కరోనా వైరస్‌ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించిందంటూ నిన్నంత తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బి-1.617.. భారత్‌ రకం స్ట్రెయిన్‌ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎక్కడా వెల్లడించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని పేర్కొంది. 

‘‘బి-1.617 వైరస్‌ స్ట్రెయిన్‌ ఆందోళనకర రకంగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో బి-1.617ను ‘భారత వేరియంట్‌’ అని పేర్కొన్నారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవే కాక అవాస్తం. బి.1.617ను భారత రకం స్ట్రెయిన్‌ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదు.  కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా ‘భారత్‌’ అనే పదం లేదు’’అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. 

బి.1.6.17 స్ట్రెయిన్‌ ఆందోళనకర రకంగా పేర్కొన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్‌ విభాగ సాంకేతిక నిపుణురాలు డా. మరియా వాన్‌ కేర్‌కోవ్‌ రెండు రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రత గురించి తమకు అవగాహన ఉందని, దీనిపై అధ్యయనాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ స్ట్రెయిన్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఇది ప్రపంచానికి ఆందోళనకరమని గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదంతా ప్రాథమిక సమాచారం మాత్రమేనని, దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సినం అవసరం ఉందని తెలిపారు.

చదవండి: ఇండియన్‌ కోవిడ్‌ స్ట్రెయిన్‌ ఆందోళనకరం: డబ్ల్యూహెచ్‌ఓ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top