సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీవీ షణ్ముగం సీనియర్ నేత. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో పార్టీ వద్ద పట్టుబట్టి మరీ రాజ్యసభ సీటును రాబట్టుకున్నారు. ఈ సారి ఆయన మైలం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. డీఎంకే, టీవీకే అభ్యర్థులతో సహా 21 మంది సీవీ షణ్ముగంను ఓడించే దిశగా ఇక్కడ పోటీచేశారు.
అయితే, గత కొన్నేళ్లుగా సీవీ షణ్ముగం ఇక్కడి ప్రజలతో మమేకం కావడం విజయాన్ని వరించింది. 82,535 ఓట్లను ఆయన రాబట్టుకున్నారు. సుమారు 30 వేల ఓట్లమెజారిటీతో గెలిచిన సీవీ షణ్ముగం రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న సీవీ షణ్ముగం అదే చేతితో రాజ్య సభ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.


