కొనుగోలుదారులకు బిగ్ షాక్
బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15%కి పెంపు
డాలర్ల డ్రెయిన్ ఆపేందుకు కేంద్రం కఠిన నిర్ణయం
ప్లాటినంపై సుంకం 15.4 శాతానికి పెంపు
వెంటనే అమల్లోకి వచ్చిన రేట్లు
దీనికి 3 శాతం జీఎస్టీ అదనం
అవసరంలేని దిగుమతులను తగ్గించే లక్ష్యం
రూపాయి విలువను కాపాడే ప్రయత్నం
ముడిచమురు, ఎరువులకే ప్రాధాన్యం
విదేశీ మారకం నిల్వల తరుగుదలకు చెక్!
‘‘అవసరం లేని బంగారం కొనొద్దు’’ అన్న మోదీ పిలుపు తర్వాతే ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న బంగారం దిగుమతులు, విదేశీ మారకద్రవ్యంపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన రెండు రోజులకే ఈ దిశగా కఠిన చర్యలకు దిగింది. తగ్గిపోతున్న రూపాయి విలువను కాపాడేందుకు, అవసరం లేని దిగుమతులను కట్టడి చేసేందుకు పసిడి, వెండిపై దిగుమతుల సుంకాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 6 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం చేసింది. ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచింది. బుధవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఆభరణాలు, వాటి విడిభాగాలు, కాయిన్లు, కడ్డీలు సహా భౌతిక రూపంలోని దిగుమతులు అన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకీ చర్యలు..?
⇒ కస్టమ్స్ డ్యూటీ పెంచడానికి అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితులను ప్రభుత్వం కార ణంగా పేర్కొంది. అంతర్జాతీయ సంక్షోభాల్లో అవసరంలేని దిగుమతులను నియంత్రించడం స్థూల ఆర్థిక స్థిరత్వానికి సాయం చేస్తుందని అధికారుల వాదన.
⇒ డాలర్తో రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్టమైన 95.75 స్థాయికి పడిపోయింది. 2025 డిసెంబర్లో 90 స్థాయిలో ఉంటే, ఐదు నెలల్లోనే 6% పతనమైంది. దీంతో దిగుమతులకు మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం రూపాయి విలువ 84.2 స్థాయిలో ఉండడం గమనార్హం.
⇒ పశ్చిమాసియాలో ఘర్షణలతో సరఫరా సమస్యలు ఏర్పడి, అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. భారత్కు ప్రధాన సరఫరా మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరఫరా తగ్గిపోయింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 108 డాలర్లకు చేరింది. యుద్ధానికి ముందు ఈ ధర 70 డాలర్లలోపే ఉండడం గమనార్హం. దీంతో ఎరువుల ధరలూ భారీగా ఎగిశాయి.
⇒ భారీ ధరలపై ముడి చమురు, ఎరువులు, బంగారం దిగుమతుల కోసం డాలర్ల అవసరం అనూహ్యంగా పెరిగింది. దీంతో రూపాయి విలువ బక్కచిక్కిపోతోంది. ఫలితంగా విలువైన విదేశీ మారకం నిల్వలు తరిగిపోతున్నాయి. ఫిబ్రవరి 27 నాటికి 728.49 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారకం నిల్వలు మే 1 నాటికి 690 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కరెంట్ ఖాతా లోటు విస్తరించే రిస్క్ ఏర్పడింది.
⇒ ఆయిల్ అండ్ గ్యాస్ తర్వాత దిగుమతి చేసుకుంటున్న రెండో అత్యంత విలువైన కమోడిటీ పసిడే. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అయిన ముడి చము రు, ఎరువులు, వంట నూనెలు, పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులకే ప్రాధాన్యం ఇస్తూ, అంత అవసరం లేని బంగారం, వెండి ఇతర విలువైన లోహాల డిమాండ్ను తగ్గించాలన్నది కేంద్ర సర్కారు యోచన.
⇒ ప్రపంచంలో చైనా తర్వాత భారతే పసిడిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. ఇది ఏటా 700–800 టన్నుల మధ్య ఉంటోంది. 2025–26లో విలువైన లోహాల దిగుమతుల విలువ అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)తో పోల్చి చూస్తే 26.7% పెరిగి 102.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో పసిడి దిగుమతులే 71.98 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. పరిమాణం పరంగా మాత్రం 4.75% తగ్గి 721.03 టన్నులుగా ఉంది. ధరలు పెరిగినప్పటికీ ప్రజల కొనుగోళ్ల విలువ తగ్గలేదని ఈ డేటాతో స్పష్టమవుతోంది.
⇒ తాజా సుంకాల పెంపుతో దిగుమతులు (పరిణామం పరంగా) 10–15% తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా యి. గతంలో సుంకాలు పెంచిన సందర్భాల్లోనే దిగుమతులు తగ్గడం గమనార్హం.
⇒ అధిక సుంకాలతో పసిడి అక్రమ రవాణా పెరిగే ప్రమాదమూ ఉంటుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ హెచ్చరించింది.
⇒ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఆర్బీఐ సహా అన్ని సెంట్రల్ బ్యాంక్లు విదేశీ మారకం ఆస్తుల్లో బంగారానికి వెయిటేజీని పెంచడం విశేషం. ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇక గృహాల్లో అయితే 30,000 టన్నులు (5 ట్రిలియన్ డాలర్ల విలువ) ఉండొచ్చని అంచనా.
సుంకాలు ఇలా..
బంగారం, వెండిపై 5 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి చేరింది. ఒక శాతంగా ఉన్న వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ)ను 5 శాతానికి పెంచారు. మొత్తం కలసి 15 శాతానికి చేరింది. ఇక విక్రయాలపై 3 శాతం జీఎస్టీ కూడా కలుపుకుంటే పసిడి, వెండిపై స్థూల పన్ను భారం ఇంతకుముందున్న 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగింది. ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి కస్టమ్స్ సుంకం పెరగ్గా, దీనికి 3 శాతం జీఎస్టీ జోడిస్తే మొత్తం పన్ను 18.86 శాతానికి చేరినట్టయింది. ధరలు పెరిగిపోవడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడనుంది. అసలు పూర్తి ప్రభావం జూన్ నెల డేటాలో కనిపించనుంది. ఇప్పటికే ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం పెరుగుదలలో బంగారం, వెండి ధరల పాత్ర ఉండడం గమనించొచ్చు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయెలరీ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే స్పందిస్తూ.. 10 గ్రాముల బంగారంపై పన్నుల భారం రూ.27,000కు చేరుకున్నట్టు (జీఎస్టీ కూడా కలసి) చెప్పారు.
భారం ఎంతంటే..
⇒ దిగుమతి పసిడి/వెండి విలువ (ఇన్వాయిస్ ధర, బీమా, రవాణా చార్జీ) రూ.1,00,000
⇒ దీనిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%= రూ.10,000
⇒ సర్చార్జీ/ఏఐడీసీ బేసిక్ డ్యూటీ 5% = రూ.5,000
⇒ మొత్తం = 1,15,000
⇒ దీనిపై 3 శాతం జీఎస్టీ = రూ.3,450
⇒ పన్ను అనంతరం మొత్తం విలువ రూ.1,18,450


