సాక్షి, చెన్నై: సేలం వెస్ట్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఓటమి పాలైన పీఎంకే రాందాసు శిబిరం నేత అరుల్ తాజాగా సామాజిక మాధ్యమంలో ఆవులు, గుర్రాలు గాడిదల పెంపకంపై దృష్టి పెట్టినట్టుగా ఫొటో పెట్టడం వైరల్గా మారింది. సేలం వెస్ట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరుల్, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఈ నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం అభ్యర్థి లక్ష్మణన్ విజయం సాధించగా, అరుల్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. కాగా ఓటమి తర్వాత తన నియోజకవర్గ ప్రజలకు దూరంగా, సొంత పనుల్లో నిమగ్నమైన అరుల్.. తన తోటలో ఆవు, గుర్రాలు, గాడిదల పెంపకంపై దృష్టి పెట్టినట్టుగా అప్పుడే పుట్టిన గాడిద పిల్లను చేతుల్లోకి తీసుకునే ఫొటోలను షేర్ చేశారు.
‘తోటలో మా పని పూర్తయింది.. ఇప్పుడు పశువులను మేపుతూ బిజీగా ఉన్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గత ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నాయకుడు, ఇప్పుడు గాడిదల కాపరిగా మారానంటూ పోస్ట్ చేయడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.


