భారత్‌లో మరోసారి కరోనా కలకలం.. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

PM Modi Review Covid 19 Situation At High Level Meeting - Sakshi

న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి దడ పట్టిస్తోంది. కోవిడ్‌ పుట్టినిల్లుగా భావించే చైనాలో ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌ ప్రస్తుతం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు జీరో కోవిడ్‌ పేరుతో అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ పరిస్థితి అతలాకుతలమైంది. కేసులు మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాబోయే కాలంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగనున్నట్లు వార్తలు వెలువడుతుండడంతో అన్నీ దేశాల్లో ఆందోళన మొదలైంది. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు చాచే ప్రమాదం కనిపిస్తోంది.

తాజాగా భారత్‌లోని కోవిడ్‌ పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టనున్నారు. చైనాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ సబ్‌ వేరయంట్‌  బీఎఫ్‌.7 భారత్‌లో ఇప్పటికే నాలుగు నమోదయ్యాయి. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో రెండు కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో మోదీ వీటిపై చర్చించనున్నారు. వైరస్‌వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. గుజరాత్‌లో బీఎఫ్‌.7 సోకిన ఇద్దరు పేషేంట్లు హోం ఐసోలేషన్‌ చికిత్స పొంది ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం భారత్‌లో 10 రకాల కోవిడ్‌ వేరియంట్లు ఉండగా తాజాగా  బీఎఫ్‌7 నమోదైంది.
చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు..

మరోవైపు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌.7 ఇప్పటికే భారత్‌లోనూ బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లోని అన్ని విమానాశ్రయాల్లో కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించడం ప్రారంభించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. . కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని, ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. 

అయితే  విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో తగిన జాగ్రత్తలు పాటిస్తే భారత్‌కు అంత ముప్పేమి ఉండదని నిపుణలు చెబుతున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్‌లో ఎక్కువగా కనిపిస్తాయని.. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తన్నారు. ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్‌లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top