కొత్త సర్కార్‌కు రిక్వెస్ట్‌.. ఎంకే స్టాలిన్‌ కీలక పోస్ట్ | Mk Stalin Urges New Govt To Continue With Dmk Schemes | Sakshi
Sakshi News home page

కొత్త సర్కార్‌కు రిక్వెస్ట్‌.. ఎంకే స్టాలిన్‌ కీలక పోస్ట్

May 9 2026 8:00 PM | Updated on May 10 2026 11:58 AM

Mk Stalin Urges New Govt To Continue With Dmk Schemes

చెన్నై: కూటమి నుండి వైదొలిగిన కాంగ్రెస్‌పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. మరో వైపు, రాబోయే కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ.. డీఎంకే పథకాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజల కోసం డీఎంకే ఎంతో చేసిందన్నారు. విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తమ కూటమి నుంచి బయటకు రావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కూటమి తరఫున పోటీ చేసి గెలిచినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా డీఎంకే ప్రధాన కార్యాలయానికి రాలేదని.. ఆ రోజే డీఎంకేతో సంబంధాలను తెంచుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను అవకాశవాదిగా అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మద్దతు ఇచ్చినప్పటికీ, వీసీకేతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీలు కూటమిలోనే కొనసాగుతాయని ఆయన అన్నారు.

కమ్యూనిస్ట్ నేతలు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్లతో పాటు విడుదల చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ నాయకుడు తిరుమావళవన్.. తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం డీఎంకేతో చేతులు కలిపి పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తద్వారా వారు తమ మధ్య ఉన్న స్నేహభావాన్ని చాటుకోవడమే కాకుండా, బలమైన సిద్ధాంతాలు కలిగిన డీఎంకేపై తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు," అని ఆయన కొనియాడారు.

"డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను సాధించలేకపోయినప్పటికీ.. తమకు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి ఆటంకాలు సృష్టించబోమని.. డీఎంకే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తుందని తాను ఇప్పటికే ప్రకటించానని స్టాలిన్‌ గుర్తు చేశారు. తమ మిత్రపక్షాలు తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా డీఎంకే.. గౌరవిస్తుందని, మళ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకుండా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా సమన్వయంతో వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement