ఘనంగా మెట్ గాలా 2026
న్యూఢిల్లీ: ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెట్ గాలా 2026’వేడుక న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ ఏడాది ‘కాస్ట్యూమ్ ఆర్ట్’థీమ్తో జరిగిన ఈ వేడుకలో, భారతీయ ప్రముఖులు తమ సంప్రదాయ కళా వైభవాన్ని, ఆధునిక ఫ్యాషన్ను జోడించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు.
వేడుకలో ప్రత్యేక ఆకర్షణలు
గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తుల్లో ఇషా అంబానీ మెరిసిపోయారు. అజంతా కుడ్య చిత్రాల స్ఫూర్తితో రూపొందిన ఈ గౌను, వజ్రాలు, విలువైన రత్నాలతో పొదిగి ఉంది. ఈ దుస్తుల తయారీకి 1,200 గంటల శ్రమ, 50 మందికి పైగా కళాకారులు పనిచేశారు. మెట్ గాలా అరంగేట్రం చేసిన దర్శకుడు కరణ్ జోహార్, ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్స్ స్ఫూర్తితో రూపొందించిన ‘ఫ్రేమ్డ్ ఇన్ ఎటరి్నటీ’కాస్ట్యూమ్ ధరించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ అద్భుతమైన జాకెట్ తయారీకి సుమారు 5,600 గంటల సమయం పట్టింది. హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త సుధా రెడ్డి, 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.125 కోట్లు) విలువైన చారిత్రక నెక్లెస్తో అందరి దృష్టిని ఆకర్షించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన నేవీ బ్లూ వెల్వెట్ లెహంగా ఆమెకు రాజసాన్ని తెచ్చిపెట్టింది. నటాషా పూనావాలా ‘ఆర్కిడ్ పెక్టోరల్’శిల్పాన్ని ధరించి వినూత్నంగా కనిపించగా, అనన్య బిర్లా స్టెయిన్లెస్ స్టీల్ మాస్్కతో, జైపూర్ రాజవంశీయులు గౌరవి కుమారి, సవాయ్ పద్మనాభ్ సింగ్ సంప్రదాయ దుస్తుల్లో రాజసం ఉట్టిపడేలా మెరిశారు.
నేపథ్యం, వివాదాలు
మెట్ గాలా అనేది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ నిధుల సేకరణ కోసం ఏటా నిర్వహించే అతిపెద్ద వేడుక. అయితే, ఈ ఏడాది ఈ వేడుక కొంత వివాదానికి కూడా దారి తీసింది. అమెజాన్ సంస్థాధినేత జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ బెజోస్ ఈ ఏడాదికి గౌరవ సహాధ్యక్షులుగా, ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.


