తుపాకులతో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లిన దుండగులు

Man Loses Toyota Fortuner At Gunpoint On Busy Delhi Road - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామునే జాతీయ రహదారిపై తుపాకులతో బెదిరించి రు.30లక్షలకుపైగా విలువైన ఎస్‌యూవీ కారును ఎత్తుకెళ్లారు ముగ్గురు దుండగులు. అంతా చూస్తుండగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 5.19 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాహుల్‌ అనే వ్యక్తి తన ఎస్‌యూవీ ఫార్చునర్‌ కారులో ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో ఝరేరా గ్రామంలో జాతీయ రహదారి-8పై  రోడ్డు పక్కన కారును నిలిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు తుపాకీ చూపించి బెదిరించాడు. మిగిలిన ఇద్దరు సైతం తుపాకులతో హల్‌చల్‌ చేశారు. కారును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు రాహుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 397, 34 ప్రకారం ఢిల్లీ కంటోన్మెంట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top