దళిత కుటుంబంపై కర్రలు, రాడ్లు, ఇటుకలతో.. | Madhya Pradesh Dalit Family Beaten | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబంపై కర్రలు, రాడ్లు, ఇటుకలతో..

May 5 2026 11:32 PM | Updated on May 5 2026 11:32 PM

Madhya Pradesh Dalit Family Beaten

ఛతర్‌పూర్: ఒక దళిత కుటుంబాన్ని కర్రలతో చితగ్గొట్టారు గ్రామంలోని ఐదుగురు వ్యక్తులు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామ దేవాలయానికి విరాళంగా పెద్దలు అడిగిన విధంగా ఆ దళిత కుటుంబం గోధుమలు ఇవ్వలేదని ఈ దాడి జరిగింది.

ఛతర్‌పూర్‌లోని మహారాజ్‌గంజ్ గ్రామంలో స్థానికులు ఐదుగురు ఓ దళిత కుటుంబం ఇంటికి వెళ్లి దేవాలయ విరాళం పేరుతో గోధుమలు కోరారు. అయితే, ఆ కుటుంబం గోధుమలు భారీ మొత్తంలో ఇవ్వలేమని అన్నారు. దీంతో పెద్దలు ఆ దళిత కుటుంబంపై దూషణలు చేసి, ఇంటి నుంచి బయటకు లాగి, కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. 

మహిళలు, పిల్లలను కొట్టారు. కుటుంబంలోని పలువురు రక్తస్రావం అయ్యి గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఆ కుటుంబం నుంచి డిమాండ్‌ చేసిన విరాళం వారి సామర్థ్యానికి మించి ఉంది. తాము చేతనైనంత ఇచ్చామని కుటుంబం తెలిపింది. "నేను గోధుమలు విరాళంగా ఇస్తే, ఏడాది మిగతా కాలం నా పిల్లలకు ఏమి తినిపిస్తాను?" అని బాధితుడు వచ్చి గోధుమలు అడిగిన వారికి చెప్పినట్లు సమాచారం.

దీంతో జరిగిన ఈ దాడిలో కుటుంబంలోని ఐదుగురు గాయపడ‍్డారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఆ తర్వాత స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. దాడికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో కుటుంబంపై నిందితులు దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

శ్యామ్ పటేల్, హర్దయాల్ పటేల్, కృపాల్ పటేల్, రాజా భయ్యా పటేల్, రామ్‌స్వరూప్ పటేల్, భగవత్‌దయాల్ పటేల్ తదితరులు ఈ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. మిగిలిన గోధుమలను బలవంతంగా తీసుకెళ్లి అక్కడి నుంచి తరలించారని కూడా చెప్పారు. అయితే గోధుమలను తీసుకెళ్లడానికి ఉపయోగించిన వాహనాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వారు అంటున్నారు.

పోలీసులు ఈ కేసులో చర్యలు తీసుకున్నామని తెలిపారు. సివిల్ లైన్స్ ఇన్‌స్పెక్టర్ అశుతోష్ శ్రోటి ఈ వివాదం దేవాలయ విరాళంగా గోధుమలు సేకరణ సమయంలో మొదలై, తర్వాత హింసకు దారితీసిందని చెప్పారు.

"ఈ ఘటన దేవాలయానికి గోధుమలను విరాళం కోరడం నుంచి ప్రారంభమై, తర్వాత ఘర్షణగా మారింది. నిందితులను అరెస్ట్ చేశాం. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని శ్రోటి చెప్పారు. పోలీసులు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఐదుగురు నిందితులపై చర్యలు ప్రారంభించారు. నలుగురిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement