Leaders Climb Table Noisy Scenes At MCD Standing Committee Election - Sakshi
Sakshi News home page

జై మోదీ.. కేజ్రీవాల్‌ జిందాబాద్‌.. దద్దరిల్లిన హౌజ్‌

Feb 24 2023 7:39 PM | Updated on Feb 24 2023 8:10 PM

Leaders Climb Table Noisy Scenes At MCD Standing Committee Election - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌(ఎంసీడీ)లోని స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎంసీడీ సభలో ఆప్‌, బీజేపీ నేతలు టేబుల్స్‌పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో, ఆ ప్రాంతంలో రసాభాస చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఎంసీడీలో ఆరుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎంపిక కోసం శుక్రవారం ఓటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా తామే గెలుపొందినట్టు ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ ప్రకటించారు. తమ పార్టీకి మొత్తం 138 ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ క్రమంలో​ బీజేపీ కౌన్సిలర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్టు ఆయన తెలిపారు. చెందిన ఐదుగురు సభ్యులు ఆప్‌ అభ్యర్థులకు ఓటేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌ 134 స్థానాలు గెలిచింది. అయితే ఇవాళ ఒక ఆప్‌ సభ్యుడు బీజేపీలో చేరాడు. దాంతో ఆప్‌ బలం 133కు తగ్గింది. అయినప్పటికీ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆప్‌కు 138 మంది సభ్యుల ఓట్లు పడటంతో బీజేపీ సభ్యులు క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో​ తామే గెలిచామని ఆప్‌ నేతలు చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అ‍యితే, ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్‌ కమిటీకి ముగ్గురు ఆప్‌ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపినట్టు బీజేపీ చెబుతోంది. ఆప్‌ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీంతో, స్టాండింగ్‌ కమిటీ గెలుపు ఎవరిదనే విషయంపై సస్పెన్స్‌ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సభలో కొందరు కౌన్సిలర్లు జై శ్రీరామ్‌, జై మోదీ అంటూ నినాదాలు చేయగా.. ఆప్‌ కౌన్సిలర్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ జిందాబాద్‌, కేజ్రీవాల్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. 

ఇక, ఈ ఎన్నికల్లో ఆప్‌ తరఫున అమీల్‌ మాలిక్‌, రమీందర్‌ కౌర్‌, మోహిని జీన్వాల్‌, సారిక చౌదరిలను నామినేట్‌ చేసింది. మరోవైపు, బీజేపీ కమల్‌జీత్‌ సెహ్రావత్‌, పంకజ్‌ లూథ్రాలను రంగంలోకి దింపింది. కాగా, బీజేపీలో చేరిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ గజేందర్‌ సింగ్‌ దారాల్‌ కూడా పోటీలో ఉన్నారు. అయితే, స్టండింగ్‌ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిధులను ఎలా ఉపయోగించాలి, పలు ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. 

మరోవైపు.. ఈ  ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌ ప్రకటించడంతో సభలో బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్‌ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. సభలో తన్నుకోవడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. కౌన్సిలర్లను అడ్డుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement