India Covid Updates: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
Published
Fri, Jul 22 2022 12:37 PM
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 21,880 మంది వైరస్ బారిన పడగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కరోనా నుంచి 21,219 మంది కోలుకున్నారు. ఇక, దేశంలో ప్రస్తుతం 149,482 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో వైరస్ నుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 43,171,653కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43,847,065కు చేరింది. మొత్తం 5,25,930 మంది వైరస్కు బలయ్యారు. మొత్తం కేసుల్లో మరణాలు 1.20 శాతంగా ఉన్నాయి. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 201 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. గురువారం ఒక్కరోజే 37,06,997 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 9,53,341 మందికి వైరస్ సోకింది. 1,789 మంది మరణించారు. 8 లక్షలకుపైగా కోలుకున్నారు. జపాన్లో అత్యధికంగా 135,239 కేసులు రావటం కలకలం సృష్టిస్తోంది. అమెరికాలో కొత్త కేసులు మళ్లీ లక్ష మార్క్ను దాటాయి. 250 మంది మరణించారు. జర్మనీలోనూ 107,819 కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 80వేలు, దక్షిణ కొరియాలో 71 వేల మందికి వైరస్ సోకింది.
India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW