ఈ–వ్యర్థాలతో అనర్థాలే! మూడో స్థానంలో భారత్‌.. ప్రాణాంతక క్యాన్సర్‌.. గుండె జబ్బులు

E Waste Alarming Danger Bells India 3rd Place Life Threatening Diseases - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రానిక్‌ (ఈ)–వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారుతోంది. ఏటా టీవీలు, ఏసీలు, మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల కొనుగోలు 35 శాతం పెరుగుతోంది. మరోవైపు పాత వస్తువుల రూపంలో 33 శాతం వ్యర్థాలుగా మారిపోతున్నాయి. 2021–22లో 17,86,396.65 టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడ్డాయి. వీటిలో కేవలం 3,93,007.26 టన్నులను ((22 శాతం) మాత్రమే సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం లేదా రీసైక్లింగ్‌ (పునర్వినియోగంలోకి తేవడం) చేశారు.

ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఈ–వ్యర్థాలు దేశంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ–వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల భూమి వేడెక్కి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇది రుతుపవనాల గమనాన్ని దెబ్బతీయడానికి దారితీస్తోంది. మరోవైపు ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్‌తోపాటు నికెల్, లెడ్, క్రోమియం, అల్యూమినియం వంటి విషతుల్యమైన లోహాలు భూమిలో కలుస్తున్నాయి.

దీంతో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు చర్మ, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు ప్రాణాంతక క్యాన్సర్‌ల బారినపడుతున్నారు. జంతువులు సైతం మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. 

కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు..
ఈ–వ్యర్థాలను సేకరించడం, శాస్త్రీయంగా నిర్మూలించడం లేదా రీసైక్లింగ్‌ చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుండగా అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏటా 22 శాతం ఈ–వ్యర్థాలను మాత్రమే సేకరించి రీసైక్లింగ్‌ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ–వ్యర్థాల నిర్మూలనకు సంబంధించి 2016లో రూపొందించిన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది.

2029 నాటికి ఏటా 32.30 లక్షల టన్నుల వ్యర్థాలు..
దేశంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం పెరుగుతున్నట్టే వాటి వ్యర్థాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఈ–వ్యర్థా­ల­ను వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 2028–29 నాటికి దేశంలో ఈ–వ్యర్థాలు ఏటా 32.30 లక్షల టన్నులు వెలువడే అవకాశం ఉందని కేంద్ర కాలు­ష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది.

2021–22లో 17.86 లక్షల టన్నుల ఈ–వ్యర్థా­లు వెలువడడం గమనార్హం. ఈ–వ్యర్థాలను అత్యధి­కంగా వెలువరించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఉత్తర­ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తు­న్నా­యి. ఈ–వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడం, రీసైక్లింగ్‌ చేయడం కోసం 2016లో కేంద్రం చట్టం తెచ్చినా.. అమలులో అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top