చేనేత కార్మికులను విస్మరించడం తగదు
అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కళను అందలమెక్కిస్తున్నామంటూనే కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వేస్లీ ధ్వజమెత్తారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత బాట కార్యక్రమంలో భాగంగా ఆయన అమరచింతలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్వేస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీని అమలు చేయడంతో పాటు బ్యాంకు ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. జియోట్యాగ్ ఉన్న నేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం వర్తింపజేయాలన్నారు. మరుగున పడిన చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి.. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలను త్రిఫ్ట్ ఫండ్తో ఆదుకోవాలన్నారు. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు రూ. 5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.


