
మెనూ తప్పనిసరిగా పాటించాలి
ధన్వాడ: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. మెనూ చార్ట్ను చూసి మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందిస్తున్నా అని విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పాఠశాలలో నిల్వ ఉంచిన కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించి ఏ రోజుకారోజు బియ్యం శుభ్రం చేసిన తర్వాతే వంటకు వినియోగించాలని ఆదేశించారు.
నాణ్యమైన భోజనం అందించాలి
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఇంచార్జ్ అధికారి యాదయ్య శెట్టి, సీఎంఓ రాజేంద్ర కుమార్ అన్నారు. బుధవారం జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలని, బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రం చేసి వంట చేయాలని సూచించారు. విద్యార్థులకు మెన్ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వం ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించి చేర్పించాలని అన్నారు. గతేడాది కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా చేరారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఏం భారతి, టీచర్లు భాను ప్రకాష్, మధుసూదన్ రావు, రఘురాం రెడ్డి, వంట నిర్వాహకులు పాల్గొన్నారు.