రూ.3,272 కోట్లతో అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

రూ.3,272 కోట్లతో అభివృద్ధి పనులు

Jun 23 2025 5:32 AM | Updated on Jun 23 2025 5:32 AM

రూ.3,272 కోట్లతో అభివృద్ధి పనులు

రూ.3,272 కోట్లతో అభివృద్ధి పనులు

నారాయణపేట: స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కృషితో గతంలో ఎన్నడూ లేనివిధంగా 18 నెలల కాలంలోనే రూ. 3,272 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగునీరు తేలేని ఐరన్‌ లెగ్‌ ఎస్‌ఆర్‌.రెడ్డి అని.. ఎమ్మెల్యే గోల్డెన్‌ లెగ్‌తో నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమవుతున్నాయని ఆయన తూర్పారబట్టారు. ఆదివారం స్థానిక సీవీఆర్‌ భవన్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి రూ. 2.945 కోట్లు, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రూ. 40కోట్లు, నర్సింగ్‌ కళాశాలకు రూ. 26కోట్లు, 33/11కేవీ సబ్‌స్టేషన్లకు రూ. 11కోట్లు, నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 10కోట్లు, ఎస్సీ కాలనీల అభివృద్ధికి రూ. 10కోట్లు, బీటీరోడ్లకు రూ. 13కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ. 35.79కోట్లు, జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా వద్ద జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌కు రూ. 1.23 కోట్లు, మహిళా సమాఖ్య నూతన భవనానికి రూ. 5కోట్లు మంజూరైనట్లు వివరించారు. అదే విధంగా రూ. 175కోట్లతో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ. 7.50 కోట్లతో చిల్డ్రన్‌ ఆస్పత్రితో పాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆకాల వర్షాలతో జిల్లా ఆస్పత్రి భవనం కూలిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్‌ సూచన మేరకు మెడికల్‌ కళాశాలలోకి మార్చడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రి భవనం తొలగించి, నూతన కమ్యూనిటీ ఆస్పత్రి భవనం నిర్మిస్తామన్నారు. 2018 ఎన్నికల సమయంలో కృష్ణాజలాలతో రైతుల కాళ్లు కడుగుతానని.. లేకపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన వ్యక్తి 2023లో ఎందుకు పోటీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోయిల్‌కొండ మండలంలో రిజర్వాయర్‌ నిర్మాణాన్ని అడ్డుకున్నదెవరో ప్రజలకు తెలుసని అన్నారు. బీజేపీ నాయకులకు ప్రతీది రాజకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బండి వేణుగోపాల్‌, ఆర్టీఓ బోర్డు సభ్యుడు రాజేశ్‌కుమార్‌, నాయకులు మనోహర్‌గౌడ్‌, గందె చంద్రకాంత్‌, వకీల్‌ సంతోష్‌, సరాఫ్‌ నాగరాజ్‌, మాజీ కౌన్సిలర్‌ మహేశ్‌, వెంకుగౌడ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement