
వయోజన విద్యకు ‘ఉల్లాస్’
నారాయణపేట
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025
వివరాలు 12లో u
కోస్గి: మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఉల్లాస్’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఉన్న ప్రతి మహిళా అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పథకాన్ని విద్యాశాఖ, సెర్ప్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. దశల వారీగా అమలు చేసే ఉల్లాస్ పథకంలో ముందుగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా చేయడంతోపాటు రెండో దశలో మధ్యలో బడిమానిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతితోపాటు వారి ఆసక్తిని బట్టి ఒపెన్ డిగ్రీ వరకు చదివించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఉల్లాస్ లక్ష్యం
సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ఉల్లాస్ పథకం ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో కేవలం 50 శాతం మందికి మాత్రమే సంతకం చేయడం వచ్చని, మిగిలిన సగం శాతం మంది వేలి ముద్రలు వేస్తారనేది ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారిక సమాచారం. మహిళలందరికి చదవడం, రాయడం నేర్పించాలనే ఉల్లాస్ పథకం ఉద్దేశం. ఓ పక్కా వయోజన మహిళలకు చదవడం, రాయడం నేర్పించి, మరోపక్క మధ్యలో బడి మానిన వారిని సైతం గుర్తించి వారిని నేరుగా ఓపెన్ టెన్త్, వారికి ఆసక్తి ఉంటే ఓపెన్ డిగ్రీ చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మహిళలకు చదవడం, రాయడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో ఆర్దిక క్రమశిక్షణ, పౌష్ఠికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం నేర్పిస్తారు.
మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల గుర్తింపు
ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్డీఏ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులను గుర్తించే పనిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే ఈ ఉల్లాస్ పథకం ద్వారా నిరక్షరాస్యులను గుర్తించే కార్యక్రమాన్ని సెర్ప్ అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఉన్న మహిళా సంఘాల్లోని సభ్యుల్లో నిరక్షరాస్యుల సంఖ్యను వీఓఏ (విలెజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)ల ద్వారా ఏపీఓలు గుర్తిస్తారు. ఈ నెల చివరి నాటికి సంఘాల్లో నిరక్షరాస్యులను, మధ్యలో బడి మానిన వారిని గుర్తించి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి పథకానికి సంబందించిన విదివిధానాలను సెర్ప్ అధికారులకు, సిబ్బందికి సమగ్రంగా వివరించినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు.
వలంటీర్లుగా మహిళా సంఘాల అక్షరాస్యులు
డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయగానే నిరక్షరాస్యులతో 15 నుంచి 20 మంది చొప్పున గ్రూపులను ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో మహిళా సంఘాల్లో అక్షరాస్యులైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి నిరక్షరాస్యుల గ్రూపులను కేటాయించి వారికి చదువు చెప్పిస్తారు. గ్రూపులో ఉన్న వారందరికి చదవడం, రాయడం వచ్చే వరకు వీరికి చదువు చెప్పే బాద్యత వలంటీర్లదే. ఎలాంటి పారితోషికం గాని, గౌరవ వేతనం గాని లేకుండానే కేవలం సేవాభావంతో ఎంపికై న వలంటీర్లు బాద్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ పుస్తకాలు అందించడంతోపాటు పథకం విజయవంతం అయ్యేందుకు ఆయా గ్రామాల్లోని ఉపాధ్యాయుల ద్వారా సహకారం అందించనున్నారు.
చదువురాని మహిళలనుఅక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
ఆధ్వర్యంలో చర్యలు
నిరక్షరాస్యులను
గుర్తించే పనిలో డీఆర్డీఏ సిబ్బంది
విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త
ఆధ్వర్యంలో నిర్వహణ