
నెలాఖరు నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
మద్దూరు: భూ భారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతిలో వచ్చిన దరకాస్తుల పరిశీలనపై ఆర్డీఓ రాంచందర్నాయక్తో కలిసి సమీక్షించారు. తిరస్కరించిన దరఖాస్తులపై ఖచ్చితమైన స్పష్టత ఉండాలని, ఎందుకు తిరస్కరించామనే కారణాన్ని రైతులకు చెప్పాలని సూచించారు. ఈ నెలాఖరునాటికి వంద శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యలకు చట్ట ప్రకారం పరిష్కారం చూపే బాధ్యత అధికారలదేనని స్పష్టం చేశారు. విరాసత్ దరఖాస్తుల పరిష్కారానికి నిబంధలను అనుసరించాలని, పైలెట్ మండలంలో అధికారులు భూ సమస్యలకు చూపించే పరిష్కారాలే మళ్లీ కొత్తగా ఎంపిక చేసే ఒక్కో ఫైలెట్ మండలాల్లో వర్తింప చేసే అవకాశం ఉంటుందని, అందుకే ఒకటి రెండు సార్లు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.