
విద్యాశాఖ ముందుచూపు
●
సమయానికి పుస్తకాలు
అందిస్తాం
గతంలో రెండు భాషల్లో ముద్రణకు ఆలస్యం కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి అలాంటి సమస్య లేకుండా ముందస్తుగా జిల్లా గోదాంకు 60శాతం పుస్తకాలు వచ్చాయి. మరో పక్షం రోజుల్లో మిగితా పుస్తకాలు రానున్నాయి. జూన్ 1లోపు ఎమ్మార్సీలు, క్లస్టర్ పాయింట్కు పంపి అక్కడి నుంచి స్కూళ్లకు అందిస్తాం. రాత పుస్తకాలు సైతం త్వరలో రానున్నాయి.
– గోవిందరాజులు, డీఈఓ
నారాయణపేట రూరల్: ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమై ఆర్నెళ్లు గడిచినా.. పూర్తి స్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంలో విఫలమవుతూ వచ్చిన విద్యాశాఖ అధికారులు గతేడాది నుంచి అలాంటి పొరపాట్లకు తావివ్వడంలేదు. పాఠశాలలు తెరిచిన తొలిరోజే చిన్నారులకు పాఠ్యపుస్తకాలను చేతిలో పెట్టాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. గతంలో ఆంగ్ల మాద్యమ పుస్తకాల కొరత ఎంతో ఇబ్బందికి గురిచేసింది. ఈ విద్యా సంవత్సరంలో దానిని సైతం అధిగమించడానికి కృషి చేస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి అవసరమైన పుస్తకాల సంఖ్యను ముందుగానే గుర్తించి అందుకు తగ్గట్లు 10శాతం ఎక్కువ చొప్పున గత విద్యా సంవత్సరం మధ్యలోనే ముద్రణ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని స్టాక్ పాయింట్కు సగానికిపైగా పుస్తకాలు డంప్ చేశారు.
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
జిల్లాలో తెలుగు మాద్యమంతో పాటు ఇంగ్లిష్, ఊర్దూ, కన్నడ మీడియం పాఠశాలలు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా పాఠశాలలకు సరిగ్గా పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా గోదాంలో డంప్ చేసిన వాటిని ఎమ్మార్సీలు, క్లస్టర్ పాయింట్లకు వాటిని జూన్ 1లోగా చేరుస్తారు. అక్కడి నుంచి సంబంధిత హెచ్ఎంలు వారివారి పాఠశాలల సంఖ్య ఆధారంగా పాఠ్యపుస్తకాలను తీసుకుని వెళ్తారు. గతంలో ఆంగ్ల మాద్యమంలోని పాఠశాలలకు రెండు భాషల్లో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేశారు. దీంతో ముద్రణ ఆలస్యం కావడంతో పాత పుస్తకాలతో సర్దుకున్నారు. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా పుస్తకాల పంపిణీకి సిద్ధం చేశారు.
రాత పుస్తకాలు సైతం..
ఈ విద్యా సంవత్సరం నూతనంగా పాఠ్యపుస్తలతో పాటు రాత పుస్తకాలను (నోట్స్)ను అందిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటి ముద్రణ సైతం ప్రారంభమైంది. పేపర్ రేట్లు అమాంతం పెరగడంతో బీద, మధ్య తరగతి కుటుంబాలు వారి పిల్లలకు నోట్స్ కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కొత్తగా శ్రీకారం చుట్టారు. జూన్లో పాఠశాలలు తెరిచే నాటికి వాటిని సైతం సిద్ధం చేసి అందించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు. గత రెండేళ్లుగా 6 నుంచి 10వ తరగతి వారికి అందిస్తే ఈ ఏడాది ప్రాథమిక తరగతులకు సైతం ఇవ్వనున్నారు.
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధం
ఇప్పటికే 60శాతం మేర స్టాక్
పాయింట్కు చేరిన వైనం
అన్ని తరగతులకు రాత పుస్తకాల
పంపిణీకి శ్రీకారం
60శాతం పుస్తకాలు గోదాంలో..
జిల్లా వ్యాప్తంగా 513 ప్రభుత్వ, 11 కేజీబీవీ, 6 గురుకుల, మూడు ఎయిడేడ్ పాఠశాలల్లో కలిపి 72,493 విద్యార్థులు ఉన్నారు. వీరికి 3,46,459 పుస్తకాలు అవసరమని అధికారులు నివేదిక అందించారు. అయితే వాటిలో 6,396 పాత పుస్తకాలు ఉండగా 2,30,090 పుస్తకాలు వచ్చాయి. వాటిని జిల్లా కేంద్రంలోని సింగార్బేస్ స్కూల్ గోదాంలో నిల్వ చేశారు. ఇప్పటి వరకు జిల్లాకు 60శాతం పుస్తకాలు అందినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

విద్యాశాఖ ముందుచూపు