
పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి
గంట ముందు
నుంచే అనుమతి
మూడేళ్ల పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశం కోసం మంగళవారం పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో వ్యాప్తంగా 1382మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నారాయణపేటలో 3 కేంద్రాలు, కోస్గిలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరగనుంది. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోం. హాల్టికెట్పైనా ఫొటో ప్రింట్ కాని వారు పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించుకొని గెజిటేడ్ సంతకం చేసుకొని రావాలి. పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.
– డాక్టర్ ఎం.శ్రీనివాసులు,
జిల్లా సమన్వయకర్త
●
● జిల్లాలో హాజరుకానున్న
1,382మంది విద్యార్థులు
● పేటలో మూడు..
కోస్గిలో రెండు పరీక్ష కేంద్రాలు
నారాయణపేట రూరల్/నారాయణపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, మూడు సంవత్సరాల ఇంజినీంరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్, వెటర్నరీ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసం నిర్వహించే మంగళవారం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంతో పాటు కోస్గిలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమజ్ఞమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్ఓ, డీఎస్డీసీఓ, మున్సిపల్ కమీషనర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్లతో కమిటీ ఏర్పాటు చేసి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఐదు కేంద్రాలు
జిల్లా కేంద్రంతో పాటు కోస్గిలో జరిగే పాలిసెట్ పరీక్షకు 1382మంది అభ్యర్థులకు గాను ఐదు పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో పాటు అవసరమైన ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 240 మంది, బ్రిలియంట్ స్కూల్లో 240, సిఎన్ఆర్ డిగ్రీ కళాశాల 511 మందితో కలిపి 991 మంది, కోస్గిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 151, పాల్టెక్నిక్ కళాశాలలో 240మందిని కేటాయించారు. అక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్, మూత్రశాలలు, తాగునీరు సౌకర్యంతో పాటు గాలి, వెలుతురు వచ్చే విధంగా ఉండే గదులను ఎంపిక చేశారు.
ఇవి తప్పనిసరి
పరీక్షకు అభ్యర్థులు తప్పకుండా హాల్టికెట్తో పాటు ఆధార్కార్డు, పాస్ఫొటో తీసుకుని హాజరు కావాలి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ప్రతి అభ్యర్థి హెచ్బి పెన్సిల్, బ్లూ, బ్లాక్ పెన్ వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.
కోస్గిలో..
కోస్గి రూరల్: కోస్గిలో మంగళవారం జరగనున్న పాలిటెక్నిక్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 151 మంది విద్యార్థులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 240 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు 10 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం అలస్యం అయినా పరీక్షకు అనుమతించమన్నారు.