నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అదే క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. పదో తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. ఆమెతోపాటు అడిషనల్ కలెక్టర్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు, మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రషీద్ శాలువాతో సత్కరించారు. పదిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు విశ్లేషించుకోవాలని, సప్లిమెంటరీ పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఖాజా మహబూబ్ ఖాన్, మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలోనే వనపర్తికి ఈఎస్ఐ ఆస్పత్రి
వనపర్తి టౌన్: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పుర కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో లక్షలాది మందికి నిరంతరాయంగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు కొత్త నియమకాలను చేపడతామన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి బెనిఫిట్ను అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు విజయ చందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, లైట్, హెవీ వెహికల్స్ సంఘం అధ్యక్షులు అయూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య గురువారం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేశారని డీఐఈఓ ఎర్ర అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందడానికి మొదటి విడత ప్రక్రియ మే 1 నుంచి ప్రారంభం కాగా జూన్ 30న ముగుస్తుందన్నారు. జూన్ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభమవుతాయని, అదే రోజు నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారన్నారు. కళాశాలలో చేరే విద్యార్థులు ఇంటర్నెట్ మెమోతో అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు.
కులగణన నిర్ణయం చారిత్రాత్మకం
పాలమూరు: దేశ ప్రగతికి కులగణన పునాదివంటిదని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులగణనతో పాటు జనగణనను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. అభివృద్ధి అంటే ఆర్థిక అసమానతలను తొలగించడమే అని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ.. కులగణన గురించి ఆలోచించలేదని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు వద్దని చెప్పినా ముస్లింలను కూడా బీసీల కింద గుర్తించి కులగణన లక్ష్యాన్ని తారుమారు చేసిందని విమర్శించారు. దేశం మరింత అభివృద్ధి పథంలో నడిచేందుకు ఈ కులగణన కీలకమైనదని వ్యాఖ్యానించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు, మాజీ కౌన్సిలర్ చెన్నవీరయ్య, నంబి రాజు, నాగరాజు, పిల్లి సూర్యనారాయణ, కౌకుంట్ల ఆంజనేయులు, సుదర్శన్గౌడ్, మనోహర్ పాల్గొన్నారు.

ఉన్నత స్థాయికి చేరుకోవాలి