
వచ్చే నెల మొదటి వారంలోగా.. భూ సమస్యలన్నీ పరిష్కరించాలి
నారాయణపేట: ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూ భారతి చట్టం అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న మద్దూరు మండలంలో భూ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను వచ్చే నెల మొదటి వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మద్దూరు మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల భూ సమస్యలపై అందిన దరఖాస్తులపై మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ గ్రామాల వారీగా అందిన దరఖాస్తులపై కలెక్టర్ ఆరా తీయగా.. మొత్తం 1,341 భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని మద్దూరు తహసీల్దార్ మహేశ్గౌడ్ వివరించారు. అందులో ఎక్కువగా డేటా మార్పు, విరాసత్, అసైన్ భూముల సమస్యలు ఉన్నాయన్నారు. అన్ని దరఖాస్తులను సదస్సుల్లో రైతులు నేరుగా సమర్పించారని.. ప్రస్తుతం ఆయా దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేసి.. పేపర్ వర్క్ పూర్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగు మండలాలను ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. అందులో సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఉందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను కొత్త చట్టం ద్వారా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్య తీవ్రత మేర ఏ అధికారి స్థాయిలో పరిష్కారానికి అవకాశం ఉంటుందనే ఆంశంపై అదనపు కలెక్టర్ బేన్షాలంతో కలెక్టర్ చర్చించారు. దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్కు సహకారంగా మూడు బృందాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్ సూచించారు. పైలెట్ ప్రాజెక్టు మండలంలో చూపిన భూ సమస్యల పరిష్కారాలే జూన్ 2వ తేదీ తర్వాత నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు వర్తిస్తాయన్నారు. అందుకే ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని జాగ్రత్తగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరి, సర్వే ల్యాండ్ ఏడీ గిరిధర్, మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేశ్గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, డీటీ వసుదేవరావు తదితరులు ఉన్నారు.
భూ భారతి పైలెట్ ప్రాజెక్టుపైకలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష