
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వద్దు
నారాయణపేట: జిల్లా పరిధిలో సామాజిక మాద్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టవద్దని, ఒకవేళ అలా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేస్ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయంగాను, కుల, మత, ప్రాంతీయంగాను ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని షేర్ చేసిన చర్యలు తప్పవని తెలిపారు. ఫెస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫొటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయని పేర్కొన్నారు. పోలీసులు 24/7 సోషల్ మీడియా యాప్లు, పోస్టులు పరిశీలిస్తుంటారని, ఏ పోస్టులు అయినా ఫార్వర్డ్ చేసే ముందు గమనించాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్కు డీడబ్ల్యూఓ బాధ్యతలు
నారాయణపేట: డీడబ్ల్యూఓగా విధులు నిర్వహిస్తున్న జయను బాధ్యతల నుంచి తప్పించి డీడబ్ల్యూఓ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్కు అప్పగించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకం అని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్స్ ప్రతి ఒక్క విభాగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకోసం విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యపై దృష్టిసారించాలన్నారు. వీటిద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పరిశోధన కోణం ఆలోచించే వారికి సృజనాత్మకత ఉండడం వల్ల వారు త్వరగా ఉద్యోగాలు సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా అధికారులు సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంవీఎస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పెసర క్వింటాల్ రూ.7,477
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,477 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,926, కనిష్టంగా రూ.3,505, అలసందలు గరిష్టంగా రూ.6,305, కనిష్టంగా రూ.6,055, వడ్లు హంస గరిష్టంగా రూ.1,756, కనిష్టంగా రూ.1,525, వడ్లు సోనా గరిష్టంగా రూ.2.220, కనిష్టంగా రూ.1,350, కందులు ఎర్రవి గరిష్ట, కనిష్టంగా రూ.6,869 ధర పలికాయి.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,275
జడ్చర్ల/ దేవరకద్ర: పట్టణంలోని బాదేపల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,275, కనిష్టంగా రూ.1,402 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ గరిష్టంగా రూ.5,913, కనిష్టంగా రూ.4,041, ఆముదాలు గరిష్టంగా రూ.6,137, కనిష్టంగా రూ.6,100, జొన్నలు సరాసరిగా రూ.1,817, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,011, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.1,809, రాగులు రూ.2,157 చొప్పున పలికాయి.
ఆర్ఎన్ఆర్ ధర రూ.2,236
దేవరకద్ర మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,236, కనిష్టంగా రూ.1,809 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,749, కనిష్టంగా రూ.1,629, ఆముదాలు గరిష్టంగా రూ.6,006 వచ్చాయి. సీజన్ కావడంతో మార్కెట్కు దాదాపు 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
నేడు మార్కెట్ బంద్
ఉగ్రదాడులను నిరసిస్తూ బాదేపల్లి మార్కెట్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో శనివారం క్రయవిక్రయాలను నిర్వహించడంలేదు.