
జూరాల.. భద్రమేనా?
జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు
● 18 చోట్ల రబ్బర్సీల్
దెబ్బతినడంతో లీకేజీలు
● మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు
● మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు
● ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.
రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు..
కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది.