
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
నారాయణపేట: డ్రగ్స్ వల్ల యువ శక్తి విచ్ఛిన్నం అవుతుందని, డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్, డ్రగ్స్ వాడకాన్ని నిషేధిస్తూ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. దేశ సంపద, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, విద్యార్థులు, యువతలో మార్పు రావాలన్నారు. డ్రగ్స్ వినియోగంతో శరీరంలో శక్తి తగ్గుతుందని, మంచి భవిష్యత్తును కోల్పోతారు అదో వ్యసనంగా మారుతుందన్నారు. గంజాయి, కొకై న్, హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల వల్ల అన్ని కోల్పోతారన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా, సరఫరా చేయడం తీవ్రమైన నేరమన్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారి పై సమాచారం ఇస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి మార్పుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో డ్రగ్స్ లేకుండా నిర్మూలించడం మన అందరి బాధ్యత అన్నారు. అలాగే మత్తు పదార్థాలైన డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం సంయుక్తంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ, ఎఫ్ఆర్ఓ సాయి, వలంటీర్స్ సంధ్య, లక్ష్మికాంత్ పాల్గొన్నారు.