
రాజ్యాంగ రక్షణకు ముందుకు రావాలి
నారాయణపేట: రాజ్యాంగ రక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 70 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తే, నేడు బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో తిరోగమనం వైపు ప్రయాణిస్తూ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుందని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శివారెడ్డి, బండి వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకు కుల, మత, పేద, ధనిక అనే తేడా లేకుండా సమాన హక్కులను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అంబేద్కర్ ఆధ్వర్యంలో ఎందరో మేధావులతో కలిసి రాజ్యాంగాన్ని రచించుకున్నామన్నారు. రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా కులాల మధ్య చిచ్చుపెట్టి, మతా కల్లోలలో సృష్టించి దేశాన్ని విచ్చిన్నం చేసే విధానాలను బీజేపీ అవలంభిస్తుందన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్పై స్వయంగా పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. వీటిని ప్రజల్లో ఎండగడుతూ ప్రతి గడపగడపకు వెళ్లి జై బీం, జై బాపు జై సంవిధాన్ పై విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో ఎండి. సలీం, ఎండి. గౌస్,కోట్ల రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహిమూద్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.
1,075 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత
కల్వకుర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని సంకల్పంతో రేషన్ షాపుల ద్వారా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మండలంలోని మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్మిల్పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని చెప్పినప్పటికీ అధికారులు వారి మాటలను పట్టించుకోలేదు. మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. అయినా మిల్లులో ఎఫ్ఆర్కే బియ్యం దర్శనం ఇవ్వడంతో అవి రేషన్ బియ్యం అని అధికారులు తేల్చారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు.
రాత్రి 10 గంటల వరకు..
రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎం రాజేందర్ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమాస్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు.

రాజ్యాంగ రక్షణకు ముందుకు రావాలి