
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకామాసంద్ బావాజీ జయంతి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్, జాతర నోడల్ అధికారి సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో శుక్రవారం గురులోకామాసంద్ బావాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. ఆయన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన శానిటేషన్ పనులను పరిశీలించారు. ఆయా పంచాయతీ సిబ్బందికి కేటాయించిన విధులు తూచా తప్పకుండా పాటించాలని, భక్తులకు మంచినీరు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశించారు. తహసిల్దార్ జయరాములు, ఎంపీడీఓ కృష్ణారావ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ పరిసరాల్లో జాగిలాలతో తనిఖీలు
ఎస్పీ యోగేశ్ గౌతం ఆదేశాల మేరకు ఆలయ పరిసరాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగితాలతో తనిఖీలు నిర్వహించారు. ఎవరికై నా అనుమానాస్పద వస్తువులు కనిపించినా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. శుక్రవారం నుంచి 14వ తేది వరకు కొనసాగే ఉత్సవాలకు వచ్చే భక్తుల భద్రత నిమిత్తం 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని కోస్గి సీఐ సైదులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాతర బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు రానివ్వకుండా ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేసి డైవర్షన్, వాహనాల కొరకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతరలో పోలీస్ పికెట్స్, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా మఫ్టీలో పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. జాతరలో చిన్నారులు, ముసలి వాళ్లు ఎవరైనా తప్పిపోతే పోలీస్ కంట్రోల్ రూం,లేదా దగ్గరలోని పోలీసులకు తెలియజేయాలని, అత్యవసర సమయంలో 100కి కాల్ చేయాలని తెలిపారు. మద్దూరు ఎస్ఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు.