
బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
కొత్తపల్లి: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన లంబాడా జాతర గురులోకమా సంద్ బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసి బావాజీ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించనుండగా.. బుధవారం ఆలయ సమీపంలో ఎస్పీ యోగేష్గౌతమ్తో కలిసి కలెక్టర్ ఆలయ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబందించి అధికారులకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. నోడల్ అదికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వీఐపి మేనెజ్మెంట్ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ పరంగా ఇప్పటివరకు ఏఏ ఏర్పాట్లు చేశారని ఆరా తీశారు. గతేడాది మాదిరిగానే ఈసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, డిప్యూటేషన్పై సిబ్బందిని రప్పిస్తున్నామని ఈఓ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వసతి కల్పించాలని ఆదేశించారు. భక్తులకు కోస్గి, మహబూబ్నగర్ డిపో నుండి అదనంగా మరికొన్ని బస్సులను నడిపిస్తామని డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. బస్సుల పార్కింగ్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. జాతరలో ఒక డాక్టర్ సూపర్వైజర్, ఏఎన్ఎం ఆశ కార్యకర్తలతో మూడు విడతలుగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్ఓ శైలజ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పి లింగయ్య, సీఐ సైదులు, ఎక్షైజ్ సీఐ బాలకృష్ణ, తహసిల్దార్ జయరాములు, ఎంపిడీఓ కృష్ణారావ్,ఎంపీఓ రామన్న పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు
బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. జాతరలో దొంగతనాలు జరగకుండా మఫ్టీలో పోలీసులను నియమిస్తామని, భక్తుల సౌకర్యార్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తామని, పోలీసు ఔట్పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.