
రహదారులే దిక్కు..!
వివరాలు 8లో u
నర్వ: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు (కల్లం పట్టాలు) ఎంతో అవసరం. వ్యవసాయ పొలాలు, ఇళ్ల వద్ద ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలన్నా టార్పాలిన్లు కావాల్సిందే. అలాంటి వీటిని ఐదేళ్ల క్రితం వరకు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 50శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందించేది. ఆ తర్వాత టార్పాలిన్ల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటులో అధిక ధరలకు టార్పాలిన్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి సైతం ప్రోత్సాహం కరువైంది. ఫలితంగా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రహదారులపై పంట నూర్పిళ్లు, ధాన్యం ఆరబోత వంటి పనులు చేపడుతున్నారు. గతేడాది కురిసిన అకాల వర్షాలకు చాలా మంది రైతుల ధాన్యం తడిసిపోవడంతో నష్టపోయారు. ప్రస్తుతం యాసంగిలో సాగుచేసిన వరిపంట చేతికిరావడంతో కోతలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండలు తీవ్రంగా ఉన్నా ధాన్యం ఆరబెట్టేందుకు టార్పాలిన్లు లేకపోవడంతో రహదారులే దిక్కుగా మారాయి. అయితే రహదారులపై ధాన్యం ఆరబోతతో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు రైతులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు.
అకాల వర్షాలతో ఇబ్బందులు..
జిల్లాలో వరికోతలు చేపట్టిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఎక్కువ శాతం రహదారులనే కల్లాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల సాయంత్రం కాగానే అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యంతో పాటు మిరప, ఇతర పంటలు తడిసిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని, ఇతర పంటలను ఆరబెట్టుకోవాలంటే టార్పాలిన్లు ఎంతో అవసరమని చెబుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీని పునఃప్రారంభించాలని రైతన్నలు కోరుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లావ్యాప్తంగా యాసంగిలో 1.51 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దాదాపు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గత సీజన్ మాదిరిగానే ఈసారి సన్నాలకు ప్రభుత్వం బోనస్ రూ.500 ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఇటీవల అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. దీంతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు సుమారు 100కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పంట నూర్పిళ్లు, ధాన్యం ఆరబెట్టేందుకు రైతుల అవస్థలు
సబ్సిడీపై రైతులకు అందని టార్పాలిన్లు
ఐదేళ్లుగా మూలనపడిన పథకం
కల్లాల నిర్మాణాలకు సైతం ప్రోత్సాహం కరువు