కర్నూలు(సెంట్రల్): లేబర్ కోడ్ల రద్దుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం నేషనల్ డిమాండ్స్ డేలో భాగంగా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మునెప్ప, జిల్లా కార్యదర్శి ఎన్.లెనిన్బాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, ఏఐయూటీయూసీ జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ.. సంస్కరణల పేరుతో కార్మికులకు రక్షణగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను కార్పొరేటర్లకు అనువుగా తీసుకొచ్చారని ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. వామపక్ష, కార్మిక సంఘాల నాయకులు ఎన్.కృష్ణయ్య, పీఎస్ రాధాకృష్ణ, నరసింహులు, నగేష్, టి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


