జిల్లా కలెక్టర్‌కు గజమాలతో సన్మానం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌కు గజమాలతో సన్మానం

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

పాణ్యం: జిల్లా కలెక్టర్‌ రాజకుమారిని భూపనపాడు గ్రామంలోని బీసీ కాలనీ ప్రజలు సోమవారం గజమాలతో ఘనంగా సత్కరించారు. మహిళలు పసుపు, కుంకుమ, చీర అందజేసి కృతజ్ఞలు తెలిపారు. నంద్యాలలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటి ముందు మోకాల్లోతులో మురుగునీరు నిల్వ ఉండి రోగాల బారిన పడేవారమన్నారు. జిల్లా కలెక్టర్‌కు విషయాన్ని తెలపగా గ్రామానికి వచ్చి అన్ని శాఖల అధికారులను కాలనీకి రప్పించి అక్కడే సమస్యకు పరిష్కారం చూపారన్నారు. కాలనీలో డ్రైనేజీ వెళ్లేందుకు రెండు వైపులా కాల్వలు తీసి కొత్త సీసీ రోడ్డు వేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ నుంచి రూ.65లక్షల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారన్నారు.

అధికారులూ.. పనితీరు మెరుగుపర్చుకోవాలి

నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. రాబోయే మూడు నెలల్లో ప్రతి శాఖలో నెలకు కనీసం 1.5 శాతం చొప్పున ప్రగతి కనిపించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్జీలను ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఈపీటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ పాస్‌బుక్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌) డాక్యుమెంట్ల అప్‌లోడింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రామునాయక్‌, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

20న మెడికల్‌ షాపుల బంద్‌

నంద్యాల(వ్యవసాయం): మెడికల్‌ షాపులను ఈ నెల 20న బంద్‌ చేయనున్నట్లు నంద్యాల జిల్లా కెమిస్ట్రీ అండ్‌ డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌ రెడ్డి, కార్యదర్శి బైసాని రమేష్‌ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిక డిస్కౌంట్‌ను, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసమే ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులను ఒక్కరోజు బందుకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ముందుగానే తమకు అవసరమైన మందులను కొనుగోలు చేసి ఉంచుకోవాలని సూచించారు.

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు

103 ఫిర్యాదులు

బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా పోలీసు కార్యా లయంలో ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 103 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్టపరమైన సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపామన్నారు. మిగతా సమస్యలను ఆయా పోలీస్‌స్టేషన్‌ అధికారులకు పంపించామన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించామన్నారు.

నేటి నుంచి

ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలు

కర్నూలు సిటీ: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌–2026 ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి (మంగళవారం) నుంచి మొదలైయ్యే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారితంగా నేటి నుంచి 18వ తేది వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌, 19, 20 తేదిల్లో అగ్రికల్చర్‌, ఫార్మా సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా లో అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ పరీక్షలకు 29,144 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయానికి ఒక్క ని మిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని సెట్‌ కన్వీనర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement