తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పెనుమాక శివారు వద్ద సీడ్ యాక్సెస్ రోడ్లో సోమవారం స్కూటీపై వెళుతున్న హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ను వెనుక నుంచి అతివేగంగా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు (49) హైకోర్టు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉండవల్లిలో కుటుంబంతో నివాసముంటున్న శ్రీనివాసరావు ఉదయం 7 గంటల సమయంలో తన స్కూటీపై సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి పెనుమాక మీదుగా హైకోర్టుకు వెళుతున్నాడు. పెనుమాక మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం రోడ్డులో స్కూటీపై వెళుతున్న శ్రీనివాసరావును వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి రోడ్డుపై తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న శ్రీనివాసరావును వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


